గంటకు కనీసం ఒకరి చొప్పున..
2020లో 11,396 మంది : ఎన్సిఆర్బి నివేదిక
కుటుంబాలు, ప్రభుత్వాల సమిష్టి వైఫల్యంగా సామాజికవేత్తల విమర్శ
న్యూఢిల్లీ: 2020లో దేశంలో రోజుకు సగటున 31మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్సిఆర్బి) వెల్లడించింది. అంటే గంటకు కనీసం ఒకరి చొప్పున ఆత్మహత్యలకు పాల్పడ్డారని అర్థం. 2020లో 18 ఏళ్లలోపు చిన్నారులు 11,396మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2019లో ఈ సంఖ్య 9613గా నమోదైంది. అంటే 2020లో 18 శాతం అధికమని అర్థం. 2018లో ఆత్మహత్యలు 9413 నమోదయ్యాయి. దీనికన్నా 21 శాతం అధికంగా ఇప్పుడు నమోదయ్యాయని అర్థం. చిన్నారుల్లో ఆత్మహత్యలు పెరగడానికి కొవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన సామాజిక, మానసిక సమస్యలు కూడా కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆత్మహత్యలకు పాల్పడినవారిలో 5,392మంది బాలురు కాగా, 6004మంది బాలికలు. కుటుంబ సమస్యల వల్ల 4006మంది, ప్రేమ వ్యవహారాల వల్ల 1337మంది, అనారోగ్య సమస్యల వల్ల 1327మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మనూన్యత(మానసిక కుంగుబాటు), నిరుద్యోగం, మాదక ద్రవ్యాలకు అలవాటుపడటంలాంటి ఇతర కారణాలు కూడా చిన్నారుల ఆత్మహత్యలకు దారితీసినట్టు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల సామాజిక జీవనానికి దూరం కావడం, విద్యా సంస్థలు మూసివేయడంలాంటి కారణాల వల్ల కూడా చిన్నారులు మానసిక కుంగుబాటుకు గురైనట్టు భావిస్తున్నారు. సరైన విద్య, భౌతిక ఆరోగ్య పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యాలు కూడా చిన్నారుల ఆత్మహత్యలకు కారణమని చైల్డ్ ప్రొటెక్షన్, సేవ్ ద చిల్డ్రన్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్కుమార్ అన్నారు. చిన్నారులకు సామాజిక, మానసిక మద్దతు లభించకపోవడానికి తల్లిదండ్రులు, కుటుంబాలు, ప్రభుత్వాల సమిష్టి వైఫల్యమున్నదని ఆయన పేర్కొన్నారు.