హార్వార్డ్ శాస్త్రవేత్తల బృందం
బోస్టన్: యాంటీరిట్రోవైరల్ ధెరపీ(ఎఆర్టి) అవసరం లేకుండానే హెచ్ఐవి నుంచి కోలుకున్న రెండో వ్యక్తిని గుర్తించామని శాస్త్రవేత్తలు మంగళవారం ప్రకటించారు. యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్లో తమ పరిశోధనా ఫలితాలను హార్వార్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ప్రచురించింది. ఆ వ్యక్తికి చెందిన 150 కోట్ల రక్తకణాలను పరిశీలించగా హెచ్ఐవి జీనోమ్ ఆనవాళ్లేవీ కనిపించలేదని బృందం తెలిపింది. ఇలాంటి కేసుల్ని అధ్యయనం చేయడం ద్వారా హెచ్ఐవి నిరారణకు నూతన చికిత్సలను అభివృద్ధి చేయవచ్చునని పరిశోధకుల బృందం సూచించింది. ఇలాంటి కేసుల్లో సహజ రోగనిరోధక శక్తికి కారణమయ్యే టి సెల్స్ వల్ల హెచ్ఐవి అంతమవుతున్నట్టు భావిస్తున్నారు. ఇప్పుడు అమలులో ఉన్న ఎఆర్టి వల్ల హెచ్ఐవి బాధల నుంచి పేషెంట్లకు ఉపశమనం కలుగుతుంది. కానీ, వైరస్ పూర్తిగా శరీరం నుంచి తొలగిపోదు. దాంతో,ఎఆర్టిని కొనసాగిస్తూనే ఉండాలి. గతంలోనూ ఓ కేసులో ఎఆర్టి అవసరం లేకుండానే హెచ్ఐవి నుంచి కోలుకోవడాన్ని ఇదే బృందం గుర్తించింది. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మొదటి కేసు వివరాల్ని 2020లో నేచర్ అనే జర్నల్లో పరిశోధక బృందం ప్రచురించింది.