Friday, October 18, 2024

విశ్రాంతి కోసం కారు ఆపితే.. దోపిడి దొంగల అటాక్: నటి రియా కుమారి మృతి

- Advertisement -
- Advertisement -

హౌరా : ఝార్ఖండ్ నటి రియా కుమారి కారులో కోల్‌కతా వెళ్తుండగా దోపిడీ దొంగల కాల్పులకు బలయ్యారు. తన భర్త చిత్ర నిర్మాత ప్రకాష్ కుమార్, రెండేళ్ల కుమార్తెతో కలిసి కారులో కోల్‌కతా వెళ్తుండగా దారిలో ఆమె దోపిడీ దొంగల కాల్పులకు బలయ్యారని పోలీసులు బుధవారం వెల్లడించారు. పశ్చిమబెంగాల్ హౌరా జిల్లాలో 16 వ జాతీయరహదారిపై ఈ సంఘటన జరిగింది.

రియా కుమారి భర్త కుమార్ ఉదయం 6 గంటల ప్రాంతంలో బగ్నాన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని మహిష్రేఖ సమీపాన కాసేపు విశ్రాంతి తీసుకోడానికి కారు ఆపారు. ముగ్గురు దుండగుల ముఠా ఆయనపై దాడి చేసింది. ఆయనవద్ద ఉన్న నగదు, ఇతర వస్తువులను దోపిడీ చేయడానికి ప్రయత్నించింది. భర్తను రియాకుమారి రక్షించడానికి ప్రయత్నించేసరికి దుండగుల్లో ఒకరు కాల్పులు జరిపాడని, తరువాత దొంగల ముఠా అక్కడ నుంచి పరారైందని పోలీసులు చెప్పారు.

కుమార్ సాయం వెతుక్కుంటూ తన భార్యను కారులో దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లాడు. కుల్గాచియా పిర్టాలా వద్ద కొంతమంది స్థానికులకు సంఘటన తెలియజేసి వారి సాయంతో యులుబెరియా లోని ఎస్‌సిసి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి భార్యను తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, భర్తను ప్రశ్నించామని పోలీసులు తెలిపారు. రెండేళ్ల కూతురు చాలా చిన్నదైనందున తరువాత ఆమెను ప్రశ్నిస్తామన్నారు. ఎవరినైతే స్థానికులను భర్త ప్రకాష్ కుమార్ సహాయం కోరాడో వారిని కూడా ప్రశ్నిస్తామన్నారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం కారును స్వాధీనం చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News