Saturday, October 19, 2024

దేశంలో దండిగా లిథియం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీలు, ఇతర విద్యుత్ పరికరాల తయారీలో కీలకమైన లిథియం నిల్వలు భారత్ లో తొలిపారి భారీగా వెలుగు చూశాయి. జమ్మూ, కశ్మీర్ లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది.‘ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని రిసాయి జిల్లాలో సలాల్‌హైమానా ప్రాంతంలో లిథి యం నిల్వలు కనుగొంది’ అని కేంద్ర గనుల శాఖ ట్విట్టర్ లో తెలిపింది. దేశవ్యాప్తంగా గనుల శాఖ మొత్తం 51ఖనిజ క్షేత్రాలను కనుగొనింది. వాటిని గనుల శాఖ ఆయా రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించింది.

వీటిల్లో మొత్తం 5 క్షేత్రాల్లో బంగారం నిల్వలను కనుగొన్నారు. మిగిలిన చోట్ల పొటాష్, మాలిబ్డినం, ఇతర ప్రాథమికలోహాలను కనుగొన్నారు. జమ్మూ, కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. 2018 19నుంచి ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల ఆధారంగా వీటిని కనుగొన్నారు. వీటిలో 17 చోట్ల7897 మిలియన్ టన్నుల బొగ్గు, లిగ్నైట్ ఉన్న గనులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించింది.

మరింత చౌకగా విద్యుత్ వాహనాలు, మొబైల్ ఫోన్లు

కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా విద్యుత్ వాహనాల ధరలు తక్కువగా ఉండేందుకు పలు పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రస్తుతం మన దేశం లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి లోహాలను దిగుమతి చేసుకొంటోంది. తాజాగా జమ్మూ, కశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలను కనుగొనడంతో భవిష్యత్తులో విద్యుత్ వాహన తయారీ రంగానికిమరింత బలం చేకూరనుంది. ఈ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో దీని దిగుమతులు తగ్గే అవకాశం ఉంది.

అంతేకాకుండా బ్యాటరీల ధరలు కూడా దిగివచ్చే అవకాశం ఉంది. జమ్మూ, కశ్మీర్‌లో లిథియం నిల్వలను కనుగొనడంపై కేంద్ర గనుల శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘స్వయం సమృద్ధి సాధించే దశలో విలువైన ఖనిజాలు కనుగొనడం, వాటిని ప్రాసెస్ చేయడం చాలా కీలకం’ అని పేర్కొన్నారు. లిథియం కేవలం విద్యుత్ వాహనాలకే కాదు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ కెమెరాలు లాంటి వాటి తయారీలోను కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీపై కేంద్రం దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లలో ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీలనే ఉపయోగిస్తున్నారు. లిథియం ధరలు తగ్గే కొద్దీ స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా తగ్గుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News