Saturday, September 21, 2024

చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమిపూజ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమిపూజ చేసిన మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం దీన్ని నిర్మిస్తున్నాం. జాతీయ రహదారి మీద ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ఇక్కడ ఏర్పాటు చేశాం. అత్యవసర సమయాల్లో హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వైద్యం పొందటం వీలవుతుంది. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించి, తద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యం గురించి రూ. 1300 కోట్ల పనులు చేసుకుంటున్నాం. ఇందులో చాలా వరకు పూర్తి కాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయి. నల్లగొండ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉంది. ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కేసీఆర్‌ ఇక్కడి ప్రజల అవస్థలు చూసి చలించిపోయారు.

నాంపల్లి, మునుగోడు, చండూరు, నారాయణ్ పుర్ పి హెచ్ సి 24 గంటల పాటు ఉండేలా చేస్తాం. తెలంగాణ వచ్చాక సీఎం గారు నల్గొండకు ఎంతో చేశారు. రాష్ట్రం వచ్చాక నాలుగు ఇస్తే, రెండు మెడికల్ కాలేజీలు నల్గొండ, సూర్యాపేట ఇచ్చారు. ఎయిమ్స్ అతీగతీ లేదు. ఓపీ తప్ప, ఐపీ లేదు. 2018 ప్రారంభంఅయితే మొన్న వచ్చి మోడీ భూమి పూజ చేసారు. ఎయిమ్స్ పై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ గారు ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంబించారు. ఈ ఏడాది మరో తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారు. ప్రతి నియోజక వర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. నాడు మూడు ఉంటే, నేడు 102 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మారు మూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది. పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం.

రానున్న రోజుల్లో 500 వరకు బస్తి దవాఖానాల సంఖ్య పెరుగుతుంది. ఊరూరా పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం వైద్యం పై ప్రజలకు నమ్మకం పెరిగింది. ఏప్రిల్ చివరి లోపు రాష్ట్రం అంతటా న్యూట్రిషన్ కిట్లు అందిస్తాం. జిల్లాల్లో కీమో థెరపీ సేవలు ప్రారంభిస్తున్నాము. సూర్యాపేట లో కూడా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆరోగ్య తెలంగాణ నిర్మాణంపై ఆలోచన ఉన్న సీఎం కేసీఆర్ గారు.. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా చూస్తూ కూర్చోలేదు. చేతల్లో చూపెట్టాడు. రాష్ట్ర సొంత నిధులతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తనని ప్రకటించి, అమలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఏం వచ్చిందనే వారికి, మీ కండ్ల ముందే జరుగుతున్న అభివృద్ధే సమాధానం. మారుమూల ప్రాంతాలు సైతం కొత్త జిల్లాలు కాగా, ఆ కొత్త జిల్లాలకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వచ్చాయి.

Also Read: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ కడుపులో బ్యాండేజ్ వదిలేసి..

కుమ్రం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, నాగర్ కర్నూల్ వంటి మారుమూల జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతాయని కలలో అయినా అనుకున్నామా.. కలలో కూడా అనుకోని దాన్ని సీఎం కేసీఆర్ ఇలలో చేసి చూపెట్టారు. తెలంగాణ రాక ముందు సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నా, వైద్య విద్య అన్నా.. తెలంగాణ ప్రజలకు అందని ద్రాక్ష. వైద్యం కోసం జిల్లాలు దాటి హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి. ఇక వైద్య విద్య కోసం దేశాలు దాటాల్సిన దుస్థితి. ఉమ్మడి పాలనలో సరైన వైద్యం అందక ప్రజలు అనుభవించిన నరకయాతనను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో రాష్ట్ర సొంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఒకేసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా, ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోగా, ఈ ఏడాది తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభించుకునే దిశగా అడుగులు వేస్తున్నాం.

నాడు వైద్యానికి, వైద్య విద్యకు కరువు ప్రాంతంగా ఉన్న రాష్ట్రం నేడు, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి, నాణ్యమైన వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దేశానికే మెడికల్ హబ్ గా నేడు తెలంగాణ ఆవిర్భవించింది. 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, 2022 నాటికి 46కు చేరుకున్నాయి. ఈ ఏడాది తొమ్మిది కలుపుకుంటే మొత్తం 55కు సంఖ్య చేరుతుంది. 65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏండ్లలో 35 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగింది. మెడికల్ సీట్లు నాడు 2950 ఉంటే, ఇప్పుడు 7090కి పెరిగింది. ఈ ఏడాది 9 కాలేజీల్లో సీట్లు కలుపుకుంటే 7990 అవుతాయని అని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News