Thursday, September 19, 2024

ప్రతి రక్తపు బొట్టు ప్రజల కోసం దారపోస్తా: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట:  160 కోట్ల రూపాయలతో 41 కిలోమీటర్ల రింగ్ రోడ్డును యుద్ధప్రాతిపదికన నాలుగు నెలల్లో పూర్తి చేశామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని రింగ్ రోడ్డు వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిత ఉత్సవం కార్యక్రమం ద్వారా మంత్రి తన్నీరు హరీష్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు.

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వేను తలపించేలా సిద్దిపేటలో రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిందని,  రింగు రోడ్డు నిర్మాణంలో చెట్లు తొలగించడంతో ఎంతో బాధ కలిగిందని, రింగ్ రోడ్డు చుట్టూ రెండు వైపులా మొక్కలు నాటి పెద్దవి చేసేందుకు 3 కోట్ల 34 లక్షల రూపాయలతో అటవీ శాఖ మొక్కలు నాటే కార్యక్రమంను ఈ రోజు ప్రారంభించామన్నారు. మన ప్రజలు మన ప్రాంతం అనే చిత్తశుద్ధితో చేస్తున్న పనులకు ఇది నిదర్శనమని హరీష్ రావు ప్రశంసించారు. తెలంగాణ రాకుంటే కెసిఆర్ సిఎం కాకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేనా? అని అడిగారు.

పుల్లూరులో 9 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధికి ఈ రోజు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. పిడబ్ల్యుడి రోడ్డు నుండి పుల్లూరు వరకు 2 కోట్ల 95 లక్షల రూపాయలతో డబుల్ లైన్ బిటి రోడ్డు, పుల్లూరు ఎస్సీ కాలనీ నుండి రామంచ వరకు 3 కోట్లతో బిటి రోడ్డు, నారాయణరావుపేటకు 1.80 కోట్లతో రోడ్డు, గాడిచర్ల మీదుగా నాసర్ పురా వరకు 1 కోటి 56 లక్షల రూపాయలతో రోడ్డు మరమ్మత్తు పనులు, 40 పుల్లూరు గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణ పనులు చేపట్టామన్నారు.

పిహెచ్సి, ఎఎన్ఎం సబ్ సెంటర్, అర్బన్ పిహెచ్సి మరమత్తు పనులను డిఎం అండ్ హెచ్ ఓ త్వరగా పూర్తి చేయాలని అధికారులను హరీష్ రావు కోరారు. ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు పడకున్న మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నుండి పంటలకు సాగు నీరు అందిస్తా రైతులు అధైర్య పడొద్దని సూచించారు. తక్కువ నీటితో తక్కువ సమయంలో పండే పంటలను వేయాలని, అధిక లాభాలను అర్జించే పామాయిల్ తోటలను పెట్టాలని సూచించారు. వర్ష భావంతో మహారాష్ట్రలో త్రాగునీరు సరఫరాకు కోత పెట్టారని గుర్తు చేశారు. జులై 10 వరకు వర్షం పడదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారని, కాలేశ్వరం గోదావరి నీటితో మనం వర్షం పడుకున్న ముందుకు వెళ్తున్నామన్నారు. కాలం రాకుండా సిఎం కెసిఆర్ ముందుచూపుతో చేపట్టిన కాలేశ్వరం నీటితో మన చెరువులను నింపుకుంటున్నామని వివరించారు. తన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు ప్రజల కోసం దారపోస్తానని చెప్పారు. ప్రజలు గౌరవం పెంచిన దానిని మీరు నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ రోజా రాధా కృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, డిఎఫ్ఒ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News