Thursday, October 24, 2024

దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేకు గుర్తు తెలియని అగంతకుడు బెదిరింపు లేఖ రాశాడు. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని లేఖలో రైల్వే అధికారులను హెచ్చరించాడు. వారంలోపు ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ -టు ఢిల్లీ మార్గంలో ఘటన జరుగుతుందని అగంతకుడు హెచ్చరించాడు. అయితే, ఆగంతకుడి నుంచి గతవారం హెచ్చరిక లేఖ రైల్వే అధికారులకు అందింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే అధికారులకు హెచ్చరిక లేఖ వచ్చిందని నార్త్ జోడ్ డిసిపి చందనాదీప్తి సైతం ధ్రువీకరించారు.

మూడు రోజుల క్రితం రైల్వే అధికారులు తమకు సమాచారం అందించారని ఆమె చెప్పారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఇదిలా ఉండగా జూన్ 2వ తేదీన ఒడిశా బాలాసోర్ జిల్లా బహనగ రైల్వేస్టేషన్లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో దాదాపు 280 మందికిపైగా మృతి చెందగా వెయ్యి మందికిపైగా గాయాలకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలో రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టిస్తోంది. అయితే, బెదిరింపులు ఆకతాయిలా పనేనా మరేదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News