Tuesday, September 24, 2024

సిఎం కెసిఆర్ సంకల్పంతో బిసి కులవృత్తులకు చేయూత

- Advertisement -
- Advertisement -
బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ
ప్రతి నెల 15న పథకం గ్రౌండింగ్
ఈనెలలో ప్రతి నియోజకవర్గంలో 300మందికి అందజేత
వేగంగా 5.28 లక్షల దరఖాస్తుల పరిశీలన
వీడియో కాన్పరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మంత్రి గంగుల సమీక్ష

హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పమని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన బిసి కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం పథకం లబ్ది దారులకు ఆర్థిక సహాయం అందించేందుకు సర్వం సిద్దం చేసామని మంత్రి తెలిపారు. నిరంతరాయ ప్రక్రియగా బిసిలకు ఆర్థిక సాయం కొనసాగిస్తామన్నారు. దీనిపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్ కలెక్టరేట్ నుండి మంత్రి విడియో కాన్పరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన దాదాపు 300 మంది లబ్ది దారులతో ప్రతి నియోజకవర్గంలో పథకం గ్రౌండింగ్ కొనసాగుతుందన్నారు. స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేసే ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం పాల్గొంటారని తెలిపారు. బిసి కులవృత్తుల సర్వతోముఖాబివృద్దికి కృషి చేస్తూ జిల్లా స్థాయి యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని అర్హులైన లబ్ది దారులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఈ సందర్భంగా బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం మాట్లాడుతూ 5.28 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కులవృత్తి దారులను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల తోడ్పాటును అందిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా వారి వృత్తికి సంబందించి పనిముట్లు, ముడిపదార్థాలు వంటివి తీసుకునేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా ఈ గొప్ప పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించుకున్నామన్నారు.

నిరంతర పక్రియగా కులవృత్తి దారులకు సహాయం అందించే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రతినెల 15వ తేదీ వరకు లబ్ది దారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం 15 నుండి స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేసే కార్యక్రమాన్ని చేపడ్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఇలా కృషి చేయలేదని, సంక్షేమ గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య, చేతివృత్తుదారులకు ఆర్థిక తోడ్పాటు, ప్రభుత్వం అమలు చేసే కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ కార్యక్రమాలతో గణనీయ వాటాను బిసిలకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, అన్ని జిల్లాల కలెక్టర్‌లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News