Friday, October 18, 2024

సిఎం బఘేల్ కు రూ.508 కోట్లంటూ ఆరోపణలు.. మాటమార్చిన మహదేవ్ ‘కొరియల్ ’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్లు ఇచ్చినట్టు ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నవంబర్ 3న అరెస్టయిన ఓ కొరియర్ తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని చెప్పినట్టు ఈడీ పేర్కొంది.

అయితే ఇప్పుడు ఆ కొరియర్ అసిమ్ దాస్ మాట మార్చారు. తాను ఏ రాజకీయ నేతకు డబ్బులు ముట్టచెప్పలేదని తెలిపాడు. ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని ఆరోపిస్తూ జైలు నుంచే ఈడీ డైరెక్టర్‌కు లేఖ రాశాడు. ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని ఆసిమ్ దాస్ లేఖలో పేర్కొన్నాడు. అధికారులు తన వాంగ్మూలాన్ని ఇంగ్లీష్‌లో రాశారని, ఆ భాష తనకు అర్థం కాలేదని పేర్కొన్నాడు. ఆ వాంగ్మూలంపై బలవంతంగా సంతకం చేయించారని ఆరోపించాడు.

“బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకడైన శుభమ్ సోని నా చిన్ననాటి స్నేహితుడు. ఈ అక్రమ యాప్‌కు సూత్రధారి అతడే. అతడి బలవంతం మేరకు అక్టోబరులో రెండుసార్లు దుబాయికి వెళ్లా. ఛత్తీస్‌గఢ్‌లో నిర్మాణ వ్యాపారం మొదలు పెడతానని సోనీ చెప్పాడు. నాసాయం కోరాడు. బిజినెస్‌కు డబ్బు తనే పంపిస్తానన్నాడు. ఒకరోజు నేను రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత కారు తీసుకుని ఓ హోటల్‌కు వెళ్లమని సోనీ చెప్పాడు. అతడు చెప్పిన ప్రాంతంలో కారు ఆపిన తర్వాత ఓ వ్యక్తి వాహనం లోకి వచ్చి డబ్బుల బ్యాగులు పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి నేను ఉంటున్న హోటల్ గదికి ఈడీ అధికారులు వచ్చి అరెస్టు చేశారు. అప్పుడే నన్ను ఇరికించారని అర్థమైంది. అంతేకానీ, నేను ఏ రాజకీయ నేతకు డబ్బులు డెలివరీ చేయలేదు” అని దాస్ తన లేఖలో పేర్కొన్నాడు.

మహదేవ్ బెట్టింగ్ యాప్‌పై ఇటీవల ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్ కేంద్రంగా ఈ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీలాండరింగ్ కార్యకలాపాలను ఇటీవల ఈడీ గుర్తించింది. ఈ కేసులో పలువురు బాలీవుడ్ ప్రముఖులను కూడా దర్యాప్తు సంస్థ విచారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News