Friday, October 18, 2024

తెలంగాణ భవన్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జాతీయ జెండాను, బిఆర్‌ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి కనీస అవగాహన, పరిపక్వత లేదని విమర్శించారు. సిఎం రేవంత్‌రెడ్డి దశాబ్ది వేడుకలను ఒక్క రోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెలరోజులు నిర్వహించేవాళ్లమని చెప్పారు. జై తెలంగాణ అని ఒక్క మాట పలుకలేని మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అవతరణ, కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని అన్నారు. సిఎం రేవంత్ జాక్‌పాట్ ముఖ్యమంత్రి అని, ఏదో అదృష్టవశాత్తు సిఎం అయ్యాడని ఎద్దేవా చేశారు.రాష్ట్ర ఆవిర్భావం జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమ పార్టీ తరఫున, 60 లక్షల బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు, చివరికి ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ వందనాలు అని పేర్కొన్నారు. 2001లో మలి దశ ఉద్యమంతో కొత్త విప్లవాన్ని సృష్టించి, చరిత్రను మలుపు తిప్పి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను పురుడు పోసినది కెసిఆర్ అని గుర్తు చేశారు. ఈ రాష్ట్రం కోసం అయితే ప్రాణ త్యాగాలు జరిగాయో అవన్నీ ఫలించి దశాబ్ద కాలం పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది అన్నది తీరుగా దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. 25 సంవత్సరాలుగా కెసిఆర్‌తో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకులు అందరికీ సబ్బండ వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలని, దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో కెటిఆర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి తిలకించారు. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ స్పీకర్, ఎంఎల్‌సి మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News