Saturday, September 28, 2024

భారత బీచ్‌లు సందర్శించండి.. ఇజ్రాయెలీలకు ఎంబసీ సూచన

- Advertisement -
- Advertisement -

మాల్దీవులకు ప్రయాణించకుండా ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ ఉన్నవారిపై మాల్దీవులు నిషేధం విధించిన మరునాడు సోమవారం భారత్‌లోని ఇజ్రాయెలీ రాయబార కార్యాలయం అందుకు మారుగా ఇజ్రాయెలీలకు పలు భారతీయ బీచ్‌ల గురించి వివరించింది. ‘ఇజ్రాయెలీలను మాల్దీవులు ఇక ఎంత మాత్రం స్వాగతించకపోతున్నందున ఇక్కడ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన భారతీయ బీచ్‌లు ఉన్నాయి. ఆ బీచ్‌లలో ఇజ్రాయెలీ పర్యాటకులకు సాదరపూర్వక స్వాగతం లభిస్తుంది, అత్యంత ఆత్మీయ ఆతిథేయపూర్వక పరిగణన లభిస్తుంది. మన దౌత్యవేత్తలు సందర్శించిన ప్రదేశాల ఆధారంగా భారత్‌లోని ఇజ్రాయెల్ నుంచి ఈ సిఫార్సులు పరికించండి’ అని రాయబార కార్యాలయం ‘ఎక్స్’ పోస్ట్‌లో సూచించింది. లక్షదీవుల ప్రకృతి రామణీయకతను శ్లాఘిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ జనవరిలో చేసిన పోస్ట్‌కు కూడా ముంబయిలోని

ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషాని స్పందించారు. ‘మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయం ధర్మమా అని ఇజ్రాయెలీలు ఇప్పుడు లక్షదీవుల అద్భుతమైన బీచ్‌లు సందర్శించవచ్చు’ అని శోషాని సూచించారు. ఇజ్రాయెలీ పాస్‌పోర్ట్‌లు ఉన్న వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ మాల్దీవులు ఆదివారం నిర్ణయం తీసుకున్న తరువాత ఇజ్రాయెల్ నుంచి ఈ స్పందన వచ్చింది. మాల్దీవుల దేశీయాంగ భద్రత, టెక్నాలజీ శాఖ మంత్రి అలీ ఇహసాన్ అధ్యక్షుని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘మంత్రివర్గం నుంచి సిఫార్సు రావడంతో ఇజ్రాయెలీ పాస్‌పోర్ట్‌లపై నిషేధం విధించాలని అధ్యక్షుడు డాక్టర్ మొహమద్ ముయిజ్జు తీర్మానించారు’ అని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News