Friday, September 20, 2024

ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాంఝీ

- Advertisement -
- Advertisement -

ఉప ముఖ్యమంత్రులుగా సింగ్‌దేవ్, ప్రవతీ పరీదా
నేడు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం

భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన గిరిజన నాయకుడు మోహన్ చరణ్ మాఝీ ఎన్నికయ్యారు. ఉప ముఖ్యమంత్రులుగా కెవి సింగ్ దేవ్, ప్రవతీ పరీదా ఎంపికైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడిక్కడ ప్రకటించారు. మంగళవారం నాడిక్కడ జరిగిన బిజెపి శాసన సభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా తాను, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ హాజరైనట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీని శాసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.

‘కియోంఝర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మోహన్ చరణ్ మాఝీ(52) బిజెడి అభ్యర్థి మీనా మాఝీని 11,577 ఓట్ల తేడాతో ఓడించారు. గత అసెంబ్లీలో మాఝీ బిజెపి చీఫ్ విప్‌గా పనిచేశారు. ఆయన వరుసగా నాలుగవసారి శాసనభకు ఎన్నికయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైనా కెవి సింగ్ దేవ్ పట్నాగఢ్ నియోజకవర్గంలో బిజెడి అభ్యర్థి సరోజ్ కుమార్ మెహెర్‌ను 1357 ఓట్ల తేడాతో ఓడించారు. మరో ఉప ముఖ్యమంత్రి ప్రతి పరీదా నీమాపరాలో బిజెడి అభ్యర్థి దిలీప్ కుమార్ నాయక్‌ను 4588 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక్కడి జనతా మైదానంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నది.

ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించిన వెంటనే మోహన్ మాఝీ స్పందిస్తూ పూరీ జగన్నాథుని ఆశీస్సులతోనే ఒడిశాలో బిజెపి మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మార్పు కోరుతూ బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చిన 4.5 కోట్ల మంది ఒడిశా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒడిశా ప్రజల నమ్మకాన్ని బిజెపి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఫైర్‌బ్రాండ్ గిరిజన నాయకుడిగా పేరుపొందిన మోహన్ మాంఝి ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నడిచే సరస్వతీ శిశు విద్యా మందిర్‌లో గురుజీ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News