Saturday, September 28, 2024

300 కోట్ల ఆస్తి కోసం మామను చంపిన కోడలు

- Advertisement -
- Advertisement -

రూ. 300 కోట్ల ఆస్తి కోసం సొంతమామనే కారుతో ఢీకొట్టించి చంపించిన కోడలి కిరాతకం బయటపడింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పురుషోత్తం పుట్టేవార్ (82) గత వారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తన భార్య శకుంతలను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ఆయనను ఢీకొట్టింది. హిట్ అండ్ రన్‌గా భావించిన పోలీస్‌లు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేయగా, అసలు విషయాలు బయటపడ్డాయి. పురుషోత్తాన్ని ఆస్తి కోసం ఆయన కోడలు అర్చనా సునీత హత్య చేయించినట్టు వెల్లడయింది. గడ్చిరోలిలో టౌన్‌ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న అర్చన,

తన భర్త మనీశ్ కారు నడిపే డ్రైవర్ సహకారంతో మామను హత్య చేసిందని పోలీస్‌లు వెల్లడించారు. మామ చనిపోతే ఆయన పేరు మీద ఉన్న రూ.300 కోట్ల ఆస్తి తన సొంతమవుతుందనే దురాశతో ఈ దారుణానికి పాల్పడిందని దర్యాప్తులో తేలింది. కారు డ్రైవర్ బగ్డేతోపాటు నీరజ్, సచిన్ ధార్మిక్ అనే మరో ఇద్దరు ఈ హత్యలో నిందితులుగా పోలీస్‌లు పేర్కొన్నారు. వారి నుంచి కారు, బంగారు ఆభరణాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, అర్చనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని విచారణలో వెల్లడైంది. నిబంధనలు ఉల్లంఘించి లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చినట్టు బాధితులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News