Tuesday, October 22, 2024

వర్ష బీభత్సం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వాతావరణం ఒక్క సా రిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్, మె దక్ , రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.ఉరుములు మెరుపులు పెనుగాలులతో వర్షం ప్రారంభమైంది. గా లుల ధాటికి గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది.నగరంలోని ఖైరతాబాద్, కూకట్‌పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, బంజారాహిల్స్ సహా పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. కొద్దిపాటి వర్షానికే నీరం తా రోడ్లపైకి వచ్చి చేరడంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందిపడ్డారు. వర్షానికి ఎక్కడా జనం ఇబ్బంది పడకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఎక్కడా నీళ్లు నిలిచిపోకుండా, డ్రైనేజ్ పొంగిపొర్లిన చోట ప్రజలకు ఇబ్బంది లేకుండా బల్దియా సిబ్బంది చర్యలు చేపట్టారు.హైదరాబాద్ నగరంలో భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. టోలిచౌక్ గోల్కొండ ఎండి లైన్స్‌లోని ఈదురు గాలులతో 200 సంత్సరాల నాటి చెట్టు నేలకొరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తలకు గాయాలు కాగా, 4 బైక్స్ ధ్వంసమయ్యాయి. నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్‌లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు నగరంలోని అమీర్‌పేట, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురా, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ,

లంగర్‌హౌస్, గండిపేట్, శివరాంపల్లి ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అటు మలక్ పేట, చాదర్ ఘాట్, సైదాబాద్, సంతోశ్‌నగర్, చంపాపేట్, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లోను వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. లోతట్టు కాలనీల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మ్యాన్ హోల్‌ల వద్ద ప్రమాదం జరగకుండా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్ల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. భారీ వర్షాలు కారణంగా అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దన్నారు.

23వరకూ వర్షాలు:
ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కూడా వర్షాలకు ఊతమిచ్చింది. కిందిస్థాయిలోని గాలులు ప్రదానంగా పశ్చిమ ,నైరుతి దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. ఈ నెల 23వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 20శాతం తక్కువ వర్షపాతం
దేశంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి ) తెలియజేసింది. మధ్యభారతంలో 29 శాతం వర్షపాతం తక్కువగా నమోదు కాగా, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాయువ్య రాష్ట్రాల్లో ఏకంగా సాధారణం కంటే 68 శాతం తక్కువ వర్షపాతం రికార్డవ్వగా, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20 శాతం తక్కువగా వర్షం పడింది. సాధారణంగా జూన్ 1 నుంచి జులై 8 వరకు రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించే క్రమంలో పడే వర్షాలను వేసవి వర్షాలుగా పిలుస్తారు. ఇవి రైతులు విత్తనాలు విత్తుకునేందుకు కీలకమైన వర్షాలు. రుతుపవనాల విస్తరణకు కాస్త బ్రేక్ పడింది. అవి కాస్త బలహీనమయ్యాయి. అయితే అవి ఎప్పుడు బలపడతాయో అప్పుడు కొద్ది సమయం లోనే కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండి అధికారి ఒకరు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News