Saturday, October 5, 2024

స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తా: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తా
చట్టంలో ఉన్న లొసుగులకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలి
సామాన్యుడిపై భారం పడకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ చేయాలి
కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే, ప్రభుత్వ ధర అధికంగా ఉన్న చోట తగ్గించాలని
ఆధునిక వసతులతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం చేపడుతాం
అధికారుల సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానని, దానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను వెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. చట్టంలో ఉన్న లొసుగులకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖకు సంబంధించి శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సుదీర్ఘంగా మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఐజి జ్యోతి బుద్ధ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఉన్న భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లండించారు. బహిరంగ మార్కెట్ విలువలకు, మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలని మంత్రి సూచించారు.

పనితీరు ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు
ఏఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది, తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే, ప్రభుత్వ ధర అధికంగా ఉందని అక్కడ తగ్గించాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి కసరత్తు చేయకుండానే భూముల ధరలను పెంచారని ఇప్పుడు అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని ఆయన పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు గంటల తరబడి చెట్ల కింద వేచి చూసే పరిస్థితి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తామని తెలిపారు. ఇందుకోసం అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌లకు టైమ్ స్లాట్ అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. పని భారం అధికంగా ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనితీరు ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలను చేపడుతామని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News