Saturday, October 5, 2024

బియస్‌ఎన్‌ఎల్‌పై కేంద్రం చిన్నచూపు

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో మోడీ మూడో సారి పీఠం మీద కుదురుకున్న కొద్ది రోజులకే ప్రైవేట్ టెలికం కంపెనీలు మొబైల్ రీఛార్జి ధరలను భారీగా పెంచి, ప్రజలపై 20 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపాయి. ఈ భారాల మోతకు తొలుత జియో ఉపక్రమించగా, ఎయిర్‌టెల్, వొడా దానిని అనుసరించాయి. అయితే నిర్వహణ వ్యయానికి తగ్గట్టుగా ధరలను పెంచడం అనివార్యమైందని అవి బయటికి ప్రకటించినా జనం మొబైల్ అవసరాన్ని లాభాల మూటలుగా మార్చుకోవడమే వాటి అసలు ఉద్దేశం. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో 20,607 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించగా, ఎయిర్‌టెల్ 7,467 కోట్ల రూపాయల లాభాన్ని వెనకేసుకొంది. అయినా ఈ కంపెనీల ధనదాహం తీరలేదు. దేశంలో మొబైల్ ఫోన్లను వాడుతున్న కోట్ల మంది నుంచి తలో కొంత అదనంగా పిండుకున్నా వేల కోట్లను సులభంగానే గడించవచ్చునని గట్టిగా నిర్ణయించుకున్నాయి.

బయటికి పరస్పరం పోటీదారులమన్నట్టు పోజులిస్తూ ఛార్జీల వడ్డనలో మాత్రం కూడబలుక్కునే వ్యవహరించాయి. ఒకే తరహాలో టారిఫులను పెంచి, వినియోగదారుల నెత్తిన భారాలు మోపాయి. రిలయన్స్ జియో తన టారిఫ్‌ను 12 నుండి 25 శాతం మధ్య పెంచగా, ఎయిర్‌టెల్ 11 నుండి 21 శాతం మేర హెచ్చించింది. ఎక్కువ మంది అనివార్యంగా వాడే ప్లాన్ల మీద తెలివిగా భారాలను వడ్డించాయి. కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి, కార్పొరేట్లకు దోచిపెట్టే ధోరణీ ఈ ప్రొవైడర్ల దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నాయి. ప్రైవేట్ టెలికం కంపెనీలు రంగంలోకి రాకముందే దేశంలో మూలమూలకీ విస్తరించిన ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్).

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దాని కాళ్లకు బంధనాలు వేసి, కుట్రపూరితంగా కూలదోసి, కార్పొరేట్ కంపెనీలకు రకరకాల రాయితీలతో, అవకాశాలతో విస్తరించే భూమికను ఏర్పరిచింది. బిఎస్‌ఎన్‌ఎల్ తన సేవలను విస్తరించటానికి, సాంకేతిక శక్తిసామర్థ్యాలను పెంచుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారీ అడ్డంకులు కల్పించింది. బిఎస్‌ఎన్‌ఎల్ అనేది ఒక అసమర్థ సంస్థగా చిత్రీకరించే పనిని బిజెపి నాయకులే స్వయంగా చేపట్టి, ప్రచారం చేశారు. ఊరూరా నెట్‌వర్క్ ఉన్న సంస్థను, సాంకేతిక నిపుణులు ఉన్న సంస్థను అడుగడుగునా అవహేళన చేశారు.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 3జి, 4జి, 5జి సేవల్లోకి వెళతామన్న ప్రతిసారీ అనుమతి నిరాకరించారు. 2016లో మోడీ నోట్ల రద్దు ప్రకటించి, డిజిటల్ చెల్లింపుల ప్రస్తావనను చర్చలోకి తెచ్చిన కొద్ది రోజులకే అంబానీ జియో వ్యూహాత్మకంగా రంగప్రవేశం చేసింది. ఆకర్షణీయమైన తక్కువ టారిఫ్ ప్రకటించి, కొద్దిరోజు ల్లోనే లక్షలాది మంది వినియోగదారులను గుప్పిట పట్టింది.

జియో విస్తరణకు ఇంతగా సేవలందిస్తున్న మోడీ ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్ సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడుతుంటే కర్కశంగా కత్తి ఝళిపిస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్ హై స్పీడ్ డేటాను తన వినియోగదారులకు అందివ్వాలని ప్రణాళికలు వేసుకుంటే అందుకు అనేక విధాలుగా మోకాలడ్డింది. ప్రైవేట్ ప్రొవైడర్లు రెండు, మూడు దశలు ముందుకెళ్లిన తరువాతనే ఈ సంస్థకు మొదటి దశ సేవలకు అంగీకారం తెలిపే వైఖరిని అవలంబిస్తోంది. నాణ్యమైన సంస్థల నుంచి 4జి, 5జి నిర్వహణా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్ అభ్యర్థిస్తే ఏళ్ల తరబడి కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి అతీగతీ లేదు. ఈ ద్రోహపూరిత నిర్లక్ష్యం కారణంగా 2023 -24లోనే బిఎస్‌ఎన్‌ఎల్ 1 కోటి 80 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది.

ఒక్క గత మార్చిలోనే 23 లక్షల 54 వేల మంది వైదొలిగారు. అదే నెలలో జియో 21 లక్షల 43 వేల మందిని, ఎయిర్‌టెల్ 17 లక్షల 5 వేల మందిని కొత్త కస్టమర్లుగా పొందాయి. బిఎస్‌ఎన్‌ఎల్ బలంగా ఉన్నప్పుడు నిజమైన రెగ్యులేటర్‌గా వ్యవహరించి, ప్రైవేట్ ప్రొవైడర్ల ధరలు అదుపులో ఉండటానికి కారణమైంది. క్రమేణా విస్తరణ కుంటుపడి, ప్రైవేట్ కంపెనీల విజృంభణకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రజలకు ఈ భారాల మోత లేకుండా ఉండాలీ అంటే బిఎస్‌ఎన్‌ఎల్ 5జి సేవలతో బలంగా విస్తరించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం తగిన అనుమతులూ, సహాయ సహకారాలూ అందించాలి. ప్రైవేట్ టెలికం కంపెనీల ధరల దూకుడుకు కళ్లెం వేయటం బిఎస్‌ఎన్‌ఎల్ బలోపేతం కావటం ద్వారానే సాధ్యం.

అయితే ఈ చార్జీలు పెంపుదల సామాన్య ప్రజలను తీవ్రంగా దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. ప్రైవేట్ కంపెనీలు తమ టారిఫ్‌ను ఇంత భారీగా పెంచడానికి వారికి తమ లాభాపేక్ష తప్ప ఎటువంటి కారణం ఉండదు. ప్రజల సంక్షేమం వారికి అవసరమే లేదు. 2023 24 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో 20,607 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించగా, అదే సమయంలో ఎయిర్ టెల్ 7467 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. అందువల్ల, సామాన్య ప్రజల నడ్డి విరగదిసి ఇటువంటి భారీ టారిఫ్ పెంపు పూర్తిగా అసంబద్ధంమైనది. టెలికాం రంగంలో బియస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ ప్రవేశించిన తరువాతనే కమ్యూనికేషన్ ధరలు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చినాయి. గతంలో బియస్‌ఎన్‌ఎల్ నుండి పోటీ కారణంగా, ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచకుండా తక్కువ ధరలకే ఇవ్వవలసి వచ్చినాయి.

అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకు బియస్‌ఎన్‌ఎల్ కంపెనీకి గత 8 సంవత్సరముల నుండి 4జి, 5జి సర్వీస్‌లు ఇవ్వకుండా కేంద్రం ప్రభుత్వం అడ్డుకొన్నది. అందుకే, 2019 సంవత్సరంలో 80,000 మంది బియస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులను విఆర్‌ఎస్ పేరు మీద తీసివేసింది. ఎన్నో ఆటుపోట్లు మధ్య బియస్‌ఎన్‌ఎల్ తన 4జి, 5జి సేవలను ఇప్పటి వరకు ప్రారంభించలేకపోయింది. ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాల కోసం బియస్‌ఎన్‌ఎల్ కి 4జి, 5జి సర్వీసులు కలిపించకుండా ప్రభుత్వం అడుగడుగునా అనేక అడ్డంకులను సృష్టించింది. దీని ఫలితంగా ప్రైవేట్ ఆపరేటర్లతో పోటీ పడకుండా, తద్వారా వారి ఏకపక్ష టారిఫ్ పెంపులను అరికట్టడంలో విఫలమయింది.

బియస్‌ఎన్‌ఎల్ 4జి, 5జి సేవలు అందుబాటులో లేనందున బియస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు హై స్పీడ్ డేటా సేవలను కోల్పోయారు. దీని కారణంగా బియస్‌ఎన్‌ఎల్ ని భారీగా వదిలిపెట్టి రిలయన్స్ జియో, ఎయిర్ టెల్‌కు వలస వెళ్ళవలసి వచ్చింది. కనీసం ఇప్పటికైనా దేశభక్తి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే కేంద్ర పాలకులు మొద్దునిద్రను వీడి ప్రభుత్వ రంగంలోనే బియస్‌ఎన్‌ఎల్‌ను కొనసాగించాలి. టారిఫ్‌ల పేరుతో సామాన్యుల నడ్డి విరిచేస్తున్న టెలికాం కంపెనీల కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. దేశానికే టెలిఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన బియస్‌ఎన్‌ఎల్ ఆస్తులను కూడా తెగనమ్మడానికి పూనుకున్న పాలకుల విధానాలపై రాజకీయ తీర్మానాలు చేసి రాజకీయ పోరాటాలు నడపాలి. అప్పుడు మాత్రమే బియస్‌ఎన్‌ఎల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోగలుగుతాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News