Sunday, October 6, 2024

ఎపి రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఎపిలో బిజెపి అధికారంలో ఉంది
బిజెపి అంటే బాబు, జగన్, పవన్
ఎపిలో ప్రతిపక్షం లేదు.. మొత్తం పాలకపక్షమే
2029లో ఎపికి షర్మిల సిఎం, రాహుల్ దేశానికి పిఎం
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలో బిజెపి అధికారంలో ఉందని, బిజెపి అంటే బాబు, జగన్, పవన్ అని.. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, మొత్తం పాలకపక్షమేనని, ఉన్న ముగ్గురూ పాలకపక్షమేనని తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన కొట్లాడేందుకు వైఎస్ షర్మిల మాత్రమే ఉన్నారని వెల్లడించారు.

2029లో వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతారని, అదే ఏడాదిలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని ఇదే వైఎస్ చివరి కోరిక అని అన్నారు. మంగళగిరిలో ఎపి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సభకు రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది వైఎస్ పేరు మీద లాభపడ్డారన్నారు. ఆశయాలను మోసేవాళ్లనే అసలైన వారసులుగా గుర్తించాలని వెల్లడించారు. వైఎస్ పేరు మీద వ్యాపారాలు చేసేవారు వారసులు అవుతారా? అని ప్రశ్నించారు. ఎపిలో కాంగ్రెస్ ముళ్ల బాట అని తెలిసినా ఆ పార్టీ బాధ్యతలు షర్మిల తీసుకున్నారంటే అది వైఎస్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకేనన్నారు. ఎపి కాంగ్రెస్‌కు మా తెలంగాణ మంత్రివర్గం మొత్తం అండగా నిలబడుతుందన్నారు.

అందుకే మేం అందరం ఈ సభకు హాజరయ్యాం అని అన్నారు. ‘మొదటిసారి 2007లో నేను ఎంఎల్‌సి అయినప్పుడు మండలిలో వివిధ అంశాలను ప్రస్తావించడం కోసం నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యి వైఎస్ ముందు సమస్యలను ప్రస్తావించేవాడిని. 2009లో నేను ఎంఎల్‌ఎ అయినప్పుడు కూడా నన్ను ప్రోత్సహించేవారు. నేను ఏకధాటిగా 40 నిమిషాలు మాట్లాడుతున్నప్పటికీ మధ్యమధ్యలో చాలా ఓపిగ్గా వైఎస్ నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు. సభలోకి కొత్త సభ్యులు వస్తే కొత్త వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే కొత్త వారిలో నాయకత్వం మరింత బలపడుతుంది. వారు శాసనసభలో వ్యవహరించిన తీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంద’ని సిఎం రేవంత్ అన్నారు.

వైఎస్ స్ఫూర్తిని షర్మిల కొనసాగిస్తోంది
వైఎస్‌ఆర్ తొలిసారిగా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకూ 1400 కిలో మీటర్ల మేర ఎర్రటి ఎండలో పాదయాత్ర చేశారని సిఎం రేవంత్ అన్నారు. అదే స్ఫూర్తితో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని వెల్లడించారు. 2004లో తిరుగులేని నాయకుడిగా వైఎస్ అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు.. 2004లో రాజశేఖర్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పదోన్నతి వస్తే, తాను అదే ఏడాదిలో రాజకీయ అరంగేట్రం చేశానన్నారు. దాదాపు 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి, 2024లో ముఖ్యమంత్రి హోదాలో మీ ముందు ఉన్నానన్నారు. అదేవిధంగా వైఎస్ షర్మిల కూడా 2009 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారన్నారు. ఇక్కడ ఏపీలో ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నారు. 1999లో ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ ఎలాగైతే వ్యవహరించారో, ఇప్పుడు ఎపి ప్రజల తరపున వైఎస్ షర్మిల కొట్లాడుతుందన్నారు. 1999 నాటి వైఎస్ స్ఫూర్తిని ఇప్పుడు వైఎస్ షర్మిల కొనసాగిస్తుందన్నారు.

కడపకు ఉప ఎన్నిక వస్తే గెలుపు కోసం ఊరూరూ తిరుగుతా…
ఈ మధ్య కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక వస్తుందని పేపర్లలో వస్తోందని, నిజంగా కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరిగే బాధ్యత తాను తీసుకుంటానని సిఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఏ కడప జిల్లా నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభ తగ్గిపోయిందో మళ్లీ అదే స్థానం నుంచి పార్టీని నిలబెట్టే బాధ్యత తీసుకుంటానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల గురించి చర్చ జరిగినప్పుడు కచ్చితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వస్తుందన్నారు. కొందరు రాజకీయ నాయకుల తరహాలో వైఎస్‌ఆర్ పేరును ఎవరూ మర్చిపోలేరని, ఆయన దూరమై 15 ఏళ్లు అయినప్పటికీ వైఎస్ జ్జాపకాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయన్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ రావాల్సి ఉన్నా ప్రస్తుతం ఆయన మణిపూర్ పర్యటన కారణంగా హాజరు కాలేకపోయారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News