Monday, October 7, 2024

16వ తేదీలోగా అఫిడవిట్లు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంపై జస్టిస్ పి.సి.ఘోష్ కమీషన్ విచారణను మరింత పకడ్బందీగా చేపట్టింది. సోమవారం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంప్‌హౌస్ ఇంజనీర్లను విచారించింది. అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకూ లక్ష్మీ , సరస్వతి , పార్వతి పం ప్‌హౌస్‌లకు చెందిన మొత్తం 14మంది ఇంజనీర్లు కమీషన్ ముందు హాజరయ్యారు. కంపెనీల ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కాగా వారినుంచి అవసరమైన వివరాలను సేకరించింది. అన్ని అం శాలకు సంబంధించి అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని కమీషన్ ఆదేశించింది. ఈ నెల 16వరకు ఇందుకు గడువు ఇస్తున్నట్టు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, తదుపరి సాక్ష్యాల నమోదుకు సిద్ధమవుతోంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చిన అఫిడవిట్లను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత అందులోని అంశాల ఆధారంగా నోటీసులు జారీ చేసి సాక్ష్యాలు నమోదు చేస్తారు. అనంతరం బహిరంగ విచారణ ప్రక్రియ నిర్వహించనున్నారు.

విచారణ ప్రక్రియలో భాగంగా కమిషన్ ముందు హాజరైన వారిలో లక్ష్మీ, సరస్వతి, పార్వతీ పంప్‌హౌస్‌లకు చెందిన ఇంజినీర్లు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు. వారి నుంచి అవసరమైన వివరాలు, సమాచారం తీసుకున్న కమిషన్, వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ఇచ్చిన నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కమిషన్‌కు అధికారికంగా సమర్పించింది. నివేదికను పరిశీలించిన తర్వాత అందులోని అంశాల ఆధారంగా కాగ్ అధికారులను పిలిచి పూర్తి వివరాలను తీసుకునే ఆలోచనలో కమిషన్ ఉంది. కమిషన్‌కు సహాయకారిగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా మూడు ఆనకట్టలకు సంబంధించి తమ అధ్యయన నివేదికను జస్టిస్ పీసీ ఘోష్‌కు సమర్పించారు. అటు తుది నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ, విజిలెన్స్ విభాగాన్ని కమిషన్ మరోమారు ఆదేశించింది. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కమిషన్ ఆదేశించింది.

ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో పాటు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఇటీవల ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటి పారుదల శాఖకు స్పష్టం చేసింది. తుది నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఎన్డీఎస్‌ఏ ఛైర్మన్‌తో ఆయన మాట్లాడినట్లు సమాచారం. పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు కమిషన్ ఓ ప్రతినిధిని పంపి అధ్యయనం చేయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News