Thursday, September 19, 2024

ఒలింపిక్స్‌లో భారత్ బోణి

- Advertisement -
- Advertisement -

పారిస్ : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సొంతం చేసుకుంది. షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన మను పతక పోరులోనూ ఆత్మవిశ్వాసంతో రాణించి మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఒలింపిక్‌లో భారత్ తరఫున తొలి మెడల్ సాధించిన మహిళా షూటర్‌గా మను భాకర్ రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ తొలి పతకం తో ఖాతాను తెరిచింది. కాగా, తుదిపోరులో ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్దతిలో పోటీ జరిగింది. ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్‌లు సంధించారు. ఎలిమినేషలో తక్కువ స్కోర్ అతి సాధించిన షూటర్‌ను నిర్వహాకులు నిష్క్రమింపజేశారు.

ఇలా ప్రతి రెండు షాట్స్‌లకు ఒక్కో షూటర్ నిష్క్రమించగా.. మొత్తం 24 షాట్‌లు ముగిసే సమయానికి సౌత్ కోరియా షూటర్స్ జిన్ ఒ యొ, కిమ్ యేజి వరుసగా మొదటి, రెండు స్థానాల్లో నలిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్‌ను కైవసం చేసుకున్నారు. జిన్ ఒయె 243.2 స్కోర్‌తో టాప్‌లో నిలవగా.. కిమ్ యెజి 241.3 స్కోర్‌తో మను భాకర్ కంటే మందుంజలో నిలిచింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మను భాకర్.. ఆమె ఉపయోగించిన గన్‌లో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ఘోర పరాజయంపాలైంది. అయితే ఈసారి పోటీపడిన తొలి దశలోనే అద్భుతమైన ప్రతిభాతో ఫైనల్ చేరుకుంది. మను భాకర్ కాంస్యంతో షూటింగ్‌లో ఇప్పటి వరకు భారత్ ఒలింపిక్స్ మెడల్స్ సంఖ్య ఐదుకు చేరింది. దేశానికి తొలి పతకాన్ని అందించిన మను భాకర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆమె ఫోన్‌లో మాట్లాడి.. కంగ్రాట్స్ చెప్పగా, కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా అభినందించారు. కాగా, షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. మహిళల 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్ రమిత ఫైనల్‌కు చేరింది. 631.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకుంది.

ప్రీక్వార్టర్స్‌లో నిఖత్..
భారత బాక్సర్ నిఖత్ జరీన్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల బాక్సింగ్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్ నిఖత్ 5-0తో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాను చిత్తుచేసి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నిఖత్ జరీన్ పంచ్ పవర్‌కు మ్యాక్సీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. గురువారం జరిగే ప్రీక్వార్టర్స్‌లో నిఖత్ టాప్ సీడెడ్ చైనా బాక్సర్ వు యూతో తలపడనుంది. వు యూకి బై లభించటంతో నేరుగా ప్రీక్వార్టర్స్‌లో పోటీకి దిగనుంది.

శ్రీజ, సింధు ముందుకు..
టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ, మనికా బత్రా శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన టిటి మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించింది. 30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీజ పూర్తి ఆధిపత్యం చెలాయించి సునాయాస విజయాన్ని అందుకుంది. శ్రీజ వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్‌లో పాల్గొంటుంది. మరో గేమ్‌లో మనికా బత్రా విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో ఆమె 4-1తో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన అన్నా హర్సెటీపై గెలుపొందింది. బ్యాడ్మింటన్‌లో పివి సింధు సయితం శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్‌లో పివి సింధు 21-9, 21-6 తేడాతో మాల్దీవ్స్‌కు చెందిన అబ్దుల్ రజాక్‌పై ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సింధుకు రజాక్ కనీస పోటీ ఇవ్వలేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ఆటతీరుకు మాల్దీవల ప్లేయర్ తేలిపోయింది. బుధవారం జరగనున్న రెండో రౌండ్‌లో సింధు ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాతో పోటీపడనుంది.

రోయింగ్ ఈవెంట్‌లో..
రోయింగ్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ బాల్‌రాజ్ పన్వార్ ముందుకు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన రిపేఛేజ్ విభాగం రెండో రౌండ్‌లో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. మొనాకో అథ్లెట్ క్వింటిన్ ఆంటోగ్నేల్లి తొలి స్థానం సాధించగా.. రెండో స్థానంలో నిలిచి బాల్‌రాజ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News