Thursday, September 19, 2024

నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ…
విధి, విధానాలను ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలండర్
నేడు దీనిపై అసెంబ్లీలో చర్చ పెడతాం
గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన
కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు ఆమోదం
కేబినెట్ భేటీ వివరాలను వెల్లడించిన మంత్రులు
మనతెలంగాణ/హైదరాబాద్: రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినేట్ చర్చించిందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధి, విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. దీంతోపాటు నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్ధిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలండర్‌కు కేబినేట్ ఆమోదించిందన్నారు. నేడు దీనిపై అసెంబ్లీలో చర్చ పెడతామని ఆయన తెలిపారు.

కేరళలో వయనాడ్‌లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించిందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేబినెట్ మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిందన్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కేరళ వయనాడ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

క్రీడాకారులకు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలం
క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని నిఖత్ జరీన్‌కు, సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డిజి రాజీవ్ రతన్ కుమారుడు హరిరతన్‌కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినేట్ తీర్మానించిందన్నారు. ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డిజి పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుందన్నారు.

మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్‌పేట చెరువులోకి నింపి
ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించిందని, తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపిందన్నారు.

అవసరమైతే ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించినట్టు ఆయన తెలిపారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు అధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఈ బాధ్యతలు అప్పగించి నట్టు ఆయన పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్‌పేట చెరువులోకి నింపి, అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. మొత్తం 15 టిఎంసీలను తరలించి, అందులో 10 టిఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మూడు జిల్లాల కలెక్టరేట్‌లతో ప్రాజెక్ట్ పూర్తిపై సమీక్ష
రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ఎత్తైన ప్రాంతానికి కాలువలకు సంబంధించి రూ.437 కోట్ల బడ్జెట్ ఆమోదించినందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. 13.07.2007 తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ శంకుస్థాపన చేశారని, 2007 నుంచి 2014 మధ్య హెడ్ వర్క్‌తో పాటు దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత హుస్నాబాద్ గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి కుర్చీ వేసుకొని తాను అక్కడే ఉండి కడతానన్నారు.

అయినా 10 సంవత్సరాల్లో పనులు పూర్తి కాలేదని, దాని సామర్థ్యం పెంచడం వల్ల ఎన్‌జిటి సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. భూ బాధితులపై నిరంకుశత్వంగా వ్యవహారించారనన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి హోదాలో మార్చి 2 , 2023లో గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించి అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో, హుస్నాబాద్ నియోజకవర్గం ఉన్న 3 జిల్లాల కలెక్టరేట్‌లతో ప్రాజెక్ట్‌పై పూర్తిపై సమావేశం నిర్వహించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

రాబోయే సీజన్‌లోపు గౌరవెళ్లి ద్వారా నీరు అందిస్తాం
వైఎస్‌ఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు గుండె లబ్ డబ్ అని కొట్టుకునేదన్నారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేస్తామని, ఫేజ్ – 7 కింద ఘనపూర్‌కు కూడా నీళ్లు అందుతాయన్నారు. రాబోయే సీజన్‌లోపు గౌరవెళ్లి ద్వారా నీరు అందిస్తామన్నారు. రైతు రుణమాఫీలో మొదటిసారి ఇచ్చినప్పుడు హుస్నాబాద్ రెండో స్థానం రాష్ట్రంలోనే లక్ష 50 వేల వరకు రుణమాఫీ జరిగిన దానిలో రూ.192 కోట్లు విడుదల అయ్యాయన్నారు. క్షేత్ర స్థాయి గణాంకాలు పూర్తి కావాల్సి ఉందని, భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని, కాలువల నిర్మాణాలు వేగవంతం చేస్తామని, ఆ ప్రాంత రైతాంగం కల నెరవేరుతుందన్నారు. తరువాత స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా నైపుణ్యాలు సాధించి ఉద్యోగాలు పొందుతారని, 317 జీఓ ,46 జీఓ సమస్యల పరిష్కారం చేస్తామని, 1998, 2008 డిఎస్సీలపై కూడా చర్చ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News