Thursday, September 19, 2024

7.28 కోట్లు దాటిన ఐటిఆర్ లు!

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ( 2023-24) ఆదాయపు పన్ను రిటర్నులలో( ఐటి రిటర్నులలో) సరికొత్త రికార్డు నమోదైంది. 2022-23 ఐటి రిటర్న్స్‌తో పోలిస్తే 7.5 శాతం వృద్ధితో 7.28 కోట్ల పై చిలుకు ఐటిఆర్‌లు నమోదయ్యాయని ఆదాయం పన్ను విభాగం శుక్రవారం తెలిపింది. 2024-25 అంచనా సంవత్సర ఐటి రిటర్న్స్ జూలై 31 నాటికి 7.28 కోట్లకు పైగా ఫైల్ అయ్యాయి. 2023-24 అంచనా సంవత్సర ఐటి రిటర్న్స్ 6.77 కోట్ల ఫైలింగ్స్ తో పోలిస్తే 7.5 శాతం ఎక్కువ అని ఓ ప్రకటనలో తెలిపింది. ‘2024-25 అంచనా సంవత్సరంలో మొత్తం 7.28 కోట్ల ఐటిఆర్ ఫైలింగ్స్‌ లో కొత్త ఆదాయం పన్ను విధానం కింద 5.27 కోట్ల ఐటిఆర్‌లు ఫైల్ కాగా, పాత ఆదాయం పన్ను విధానం కింద 2.01 కోట్ల ఐటిఆర్‌లు ఫైల్ అయ్యాయి’ అని వివరించింది. దీంతో పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 72 శాతం మంది కొత్త ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకుంటే, 28 శాతం మంది పాత ఆదాయం పన్ను విధానంలో ఐటిఆర్ ఫైల్ చేశారు.

2024-25 అంచనా సంవత్సరంలో ఆడిటింగ్ అవసరం లేని వేతన జీవులు ఐటిఆర్ ఫైల్ చేయడానికి 2024 జూలై 31 తుది గడువు. ఒక్క రోజే అత్యధికంగా 69.92 లక్షల ఐటిఆర్‌లు ఫైల్ అయ్యాయి. తొలిసారి ఐటిఆర్ ఫైల్ చేసిన వారు 58.57 లక్షల మంది ఉన్నారు. ఆదాయం పన్ను పరిధి విస్తృతం అవుతుందని చెప్పడానికి ఇది సంకేతం అని ఆదాయం పన్ను విభాగం వివరించింది.

ఐటిఆర్ ఫైల్ చేయడం కోసం ఆదాయం పన్ను విభాగం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన.. అంటే ఆర్థిక సంవత్సరం తొలి రోజే ‘ఈ-ఫైలింగ్ పోర్టల్’లో ఐటీఆర్ ఫామ్స్ (ఐటిఆర్-1, ఐటిఆర్-2, ఐటిఆర్-4, ఐటిఆర్-6) అందుబాటులోకి తెచ్చింది. ఇలా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాడే ఐటిఆర్ ఫామ్స్ అందుబాటులోకి తేవడం చారిత్రాత్మకంగా నిలిచింది. మొత్తం 7.28 కోట్ల ఐటిఆర్‌ల్లో ఐటిఆర్ -1 ఫామ్ కింద 45.77 శాతం అంటే 3.34 కోట్లు, ఐటిఆర్-2 ఫామ్ కింద 1.09 కోట్ల మంది (14.93 శాతం), ఐటిఆర్-3 ఫామ్ కింద 91.10 లక్షల మంది (12.5 శాతం0, ఐటిఆర్ -4 ఫామ్ కింద 1.88 కోట్ల మంది (25.77 శాతం), ఐటిఆర్ -5 నుంచి ఐటిఆర్ -7 ఫామ్స్ వరకూ 7.48 లక్షల మంది (1.03 శాతం) ఐటిఆర్ ఫైల్ చేశారు.  43.82 శాతం మంది ‘ఈ-ఫైలింగ్ పోర్టల్’లో ఆన్ లైన్ ఐటిఆర్ యుటిలిటీ సేవలను వినియోగించుకుని ఐటిఆర్ ఫైల్ చేస్తే, మిగతా వారు ఆఫ్ లైన్ చానళ్ల ద్వారా దాఖలు చేశారు.

మొత్తం 7.28 కోట్ల ఐటిఆర్‌ లలో 6.21 కోట్ల పై చిలుకు ఐటిఆర్‌ల ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. వాటిలో ఆధార్ ఆధారిత ఓటిపి ద్వారా 5.81 కోట్ల పై చిలుకు (93.56 శాతం) మంది ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. జూలై 31 వరకూ వేతన జీవులు, ఐటి ఫైల్ చేస్తున్న వారి నుంచి వచ్చిన సుమారు 10.64 లక్షల సందేహాలను ఈ-ఫైలింగ్ హెల్ప్ డెస్క్ నివృత్తి చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News