Thursday, September 19, 2024

తెలంగాణలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల క్షీణితపై కెటిఆర్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఐటి ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటి ఎగుమతులు, ఉద్యోగాల్లో క్షీణతకు సంబంధించిన గణంకాలను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. 2022 -23 సంవత్సరంలో తెలంగాణ నుంచి 57,706 కోట్ల ఐటి ఎగుమతులు ఉంటే 2023 -24 కాలానికి 26,948 కోట్ల ఎగుమతులే జరిగాయని పేర్కొన్నారు. ఐటీ ఎంప్లాయిమెంట్ కల్పన కూడా భారీగా పడిపోయిందని,

2022 -23 కాలంలో 1,27,594 కొత్త ఉద్యోగాలు వస్తే… 2023 -24లో కేవలం 40,285 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరేడేళ్లలో తెలంగాణలో ఐటి ప్రగతి గణనీయంగా పెరిగేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. సింగిల్ విండో విధానం, టిఎస్ ఐపాస్, ఐటి రంగానికి సంబంధించి ప్రభుత్వ పాలసీల కారణంగా అత్యంత వేగంగా హైదరాబాద్‌లో ఐటి రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. హైదరాబాద్‌ను దేశానికి ఐటి కేంద్రంగా చేసేందుకు ఎంతో కృషి చేశామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఐటి రంగాన్ని పూర్తిగా విస్మరిస్తుంది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటి రంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఐటి రంగం పురోగతి ఎంతో మేలు చేసిందని గుర్తు చేశారు. ఐటి రంగాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రం ఆర్థికంగా, ఉపాధి కల్పన పరంగా నష్టపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఐటితో పాటు ఐటిఇఎస్ రంగాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మళ్లీ నగరంలో ఐటి రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై ఫోకస్ పెట్టాలని కోరారు.

ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీలకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని…ఐటి రంగానికి ఉపయోగపడే విధానాలు తేవాలని పేర్కొన్నారు. ఐటి సంస్థలు మరిన్ని పెరగాలంటే ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను పెంచుతూనే….లా అండ్ ఆర్డర్‌ను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఐటి ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం నిరంతరం దృష్టి పెట్టాలని కెటిఆర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News