Friday, September 20, 2024

రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో ప్రయాణికులు

- Advertisement -
- Advertisement -

రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో ప్రయాణికులు
ఆర్‌టిసి బస్సుల్లో ఒక్కరోజే 63.86 లక్షల మంది రాకపోకలు
మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్న 41.74 లక్షల మహిళామణులు
ఒక్కరోజే మహిళలకు రూ.17 కోట్ల ఆదా 
ఆర్‌టిసి సిబ్బందికి, ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) రికార్డు స్థాయిలో 63.86 లక్షల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసిందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో 41.74 లక్షల మంది మహిళలు వినియోగించారని వెల్లడించారు. 21.12 లక్షల మంది నగదు చెల్లించి బస్సుల్లో ప్రయాణం చేశారని పేర్కొన్నారు.

రాఖీ పర్వదినం రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల రాబడి ఆర్‌టిసికి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా రూ.15 కోట్ల వరకు వచ్చిందని తెలిపారు. ఆర్‌టిసి చరిత్రలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేదన్నారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్‌టిసి సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్‌టిసి తన మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగించుకుందని, ఉద్యోగులు రాత్రి ,పగలు నిరంతరం శ్రమించారని వారి సేవలను కొనియాడారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని రద్దీ ఉన్న రూట్లలో బస్సులు అదనంగా నడిపించి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యారన్నారు.

రాఖీ పండగ ఉన్నప్పటికీ సిబ్బందికి నిరంతరం శ్రమించారని, ఆర్‌టిసి డ్రైవర్లు , కండక్టర్లకు కూడా ఫీల్డ్ లోనే బస్సుల్లో వారి సోదరీమణులు రాఖీలు కట్టారని వారందరికీ అభినందనలు తెలిపారు. మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్‌టిసిలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించి సోదరులకు రాఖీ కట్టారని, వారందరినీ అభినందిస్తూ శుభకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతంగా ఆర్‌టిసి అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఆర్‌టిసిని ఆదరిస్తోన్న, ప్రొత్సహిస్తోన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News