Thursday, September 19, 2024

సిఎంఆర్‌ఎఫ్ స్కాం కేసులో ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్స్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్‌ఎఫ్) మెడికల్ బిల్లుల స్కాం కేసులో సిఐడి ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసింది. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించిన సిఐడి అధికారులు 40 ఆసుపత్రులు, వ్యక్తులు, బ్రోకర్లు, ఇతర వ్యక్తులపై ఆరు కేసులు నమోదు చేశారు. నల్గొండలోని అమ్మా హాస్పిటల్, మిర్యాలగూడలోని నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనే రెండు ఆసుపత్రులకు సంబంధిం చిన బిల్లులు, ఇతర రికార్డులను కొందరు వ్యక్తులు సమర్పించినట్లు తెలుసుకున్న సిఐడి నల్గొండ జిల్లాలోని కొన్ని ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన సిఐడి అధికారులు మిర్యాలగూడలోని డాక్టర్స్ కాలనీలోని చాణక్య హాస్పిటల్‌లో మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్‌ఎంపీ)గా పనిచేస్తున్న గొట్టి గిరి (46), నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడలో సూపర్‌వైజర్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రెడ్డి కాలనీ నివాసి లెకిరెడ్డి సైదిరెడ్డి (40)లను అరెస్టు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 23న రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని వివిధ ఆసుపత్రులు సమర్పించిన సిఎంఆర్‌ఎఫ్ దరఖాస్తుల్లో వ్యత్యాసాలను సూచిస్తూ రెవెన్యూ శాఖ నుండి ఫిర్యాదులందాయి.

ఈ ఫిర్యాదుల ఆధారంగా మొత్తం ఆరు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నల్గొండ పరిధిలో ఇద్దరు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారని తేలింది. ఈ దరఖాస్తుల్లో ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు మోసపూరిత పత్రాలను ఉపయోగించి సృష్టించిన నకిలీ సిఎంఆర్‌ఎఫ్ బిల్లులు ఉన్నాయి. నకిలీ మెడికల్ బిల్లులను సృష్టించేందుకు వ్యక్తులు డెస్క్‌టాప్ కంప్యూటర్లను ఉపయోగించారు. హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లోని ఆసుపత్రులపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. వారు మిర్యాలగూడలోని స్థానిక ప్రింటింగ్ షాపుల నుండి వైద్యులు, ఆసుపత్రుల రబ్బరు స్టాంపులను కూడా తయారు చేశారు. వారు నకిలీ సిఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులను ఏర్పాటు చేయడానికి వ్యక్తుల నుండి దరఖాస్తుకు 4,000 వసూలు చేసి తద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశారు. నల్గొండలోని అమ్మ హాస్పిటల్, మిర్యాలగూడలోని నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరిట వీరు 19 నకిలీ దరఖాస్తులను సమర్పించారని తమ దర్యాప్తులో తేలిందని సిఐడి డిజి షీకా గోయల్ వెల్లడించారు.

మరోవైపు మిర్యాల్‌గూడలోని నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన నకిలీ మెడికల్ బిల్లులు, రబ్బరు స్టాంపులు, లెటర్‌హెడ్‌ల సాఫ్ట్ కాపీలతో కూడిన కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను సిఐడి స్వాధీనం చేసుకుంది. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నల్గొండలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (స్పెషల్ మొబైల్) కోర్టులో హాజరు పరిచారు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను గుర్తించే విధంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News