Friday, September 20, 2024

చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ జిల్లా టేకులగూడెం జగన్ స్వస్థలం
స్వగ్రామంలో విషాదఛాయలు
జగన్‌పై రూ.25లక్షల రివార్డు
చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ మృతుల వివరాలు వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్/ఖాజీపేట: మావోయిస్ట్ అగ్రనేత, మొదటి తరం నాయకుడు మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడుగా, సెంట్రల్ ఆర్మీ ఇంచార్జ్‌గా, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఇంఛార్జ్‌గా ఉన్న ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఏసోబ్ హనుమకొండ జిల్లా వాసి అని ఛత్తీస్‌గడ్ పోలీస్ అధికారులు చెబుతున్నట్టు సమాచారం. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడు మృతి చెందాడని దంతేవాడ పోలీసులు చెబుతున్నారు. రణదేవ్ భార్య మాచర్ల లక్ష్మక్క గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. రణదేవ్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రణదేవ్ మృతితో ఆయన స్వస్థలంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

కాగా ఆయన మరణంపై మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా విడుదల చేయ లేదు. మాచర్ల ఏసోబ్ మరణించారంటూ వస్తున్న వార్తలతో ఆయన స్వగ్రామం విషాదం అలుముకుంది. కాగా మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయి స్టులకు భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం విదితమే. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబ్‌పై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మొత్తం 9 మంది చనిపోయారు. మృతుల పేరు, రివార్డు వివరాలను పోలీసులు ప్రకటించారు.

మృతి చెందిన మావోయిస్టులలో రణధీర్ ( హోదా : డికెఎస్‌జెడ్‌సి ఎం) (వరంగల్ నివాసి)- (రివార్డ్ రూ.25 లక్షలు), కుమారి శాంతి ( -31 పిఎల్ సభ్యురాలు) – (రివార్డు రూ.5 లక్షలు), సుశీల మడకం, భర్త జగదీష్ (ఎసిఎం) – (రివార్డ్ రూ.5 లక్షలు), గంగి ముచకి (- కాటేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు)- (రివార్డ్ రూ.5 లక్షలు), కోసా మాద్వి ( మలంగిర్ ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు) – (రివార్డ్ రూ.5 లక్షలు), లలిత (- డీవీసీఎం సురక్షా దళ్ సభ్యురాలు) – (రివార్డ్ రూ.5 లక్షలు), కవిత (- గార్డ్ ఆఫ్ ఏవోబీఎస్‌జెడ్‌సీ) – (రివార్డ్ రూ.5 లక్షలు), హిడ్మే మంకం (- డివిసిఎం సురక్షా దళ్ సభ్యుడు) – (రివార్డ్ రూ.2 లక్షలు), కమలేశ్ (ప్లాటూన్ సభ్యుడు) బీజాపూర్ జిల్లావాసి – రివార్డ్ రూ.2 లక్షలు.

కాగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారంటూ సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో పాటు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో 303 సెల్ఫ్ లోడింగ్ రైపిల్స్, 12 తుపాకులు లభ్యమయ్యా యని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News