Thursday, September 19, 2024

మణిపూర్ మంటలు చల్లారేదెలా?

- Advertisement -
- Advertisement -

ఈశాన్య ప్రాంతంలో వివిధ జాతుల గ్రూపుల మధ్య, అస్తిత్వ సంక్షోభం జాతుల మధ్య సంఘర్షణలు పెక్కింటికి దారి తీసింది. ఈశాన్య భారతంలో సంఘర్షణ పరిస్థితిని అర్థం చేసుకోవడం సంక్లిష్టమైన అంశం. ఆ ప్రాంత సాంఘిక, సాంస్కృతిక, చారిత్రక, జాతుల రూపురేఖల గురించి లోతైన అవగాహన కలిగి ఉండడం అవసరం. నాలుగు దేశాల అంతర్జాతీయ సరిహద్దులతో ఈశాన్య భారతం కీలకమైన, వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతం. ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలు అన్నీ సాంస్కృతికంగా, భాషపరంగా, మతపరంగా భిన్నస్వభావం కలవి. భాష సంబంధిత అంతరంపరంగా విభిన్నతలు, మంగ్లాయిడ్, ఆస్ట్రలాయిడ్ జాతి మూలాలు, మతపరమైన బహుత్వం ఆ ప్రాంతాన్ని విలక్షణమైనదిగా చేశాయి.

ఈశాన్య భారతంలో అసమ్మతికి ప్రధాన కారణాలు భాష సంబంధిత సాంస్కృతిక లొంగుబాటు భయం, ఆర్థికపరమైన అలక్షం, రాజకీయ శక్తుల వైఫల్యాలు. ఈశాన్యంలో అస్తిత్వ రాజకీయాలకు ప్రధాన కారణం జాతి ప్రజల విలక్షణ మనస్తత్వం. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక భావన కోల్పోతామేమోనన్న ఉద్దేశంతో ప్రత్యేక హక్కులు పొందాలనే మనస్తతం వారిది. తమ అస్తిత్వాన్ని చాటిచెప్పడానికి ఈశాన్యంలో పలు జాతి ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. జాతుల మధ్య అశాంతి దేశానికి నేరుగా ఒక సవాల్. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ జాతుల, సాంస్కృతిక, మతపర, భాషాపర వర్గాల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి.

వివిధ ప్రభుత్వాలు ఈశాన్యంలో తిరుగుబాటు సమస్య పరిష్కారానికి విభిన్న విధానం అనుసరిస్తూ వచ్చాయి. మరొక గ్రూపును తుడిచిపెట్టేందుకు ఒక గ్రూపును ప్రోత్సహించడం, ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చేందుకు ప్యాకేజీలు అందజేయడం, ఒప్పందం కుదుర్చుకునేందుకు సంభాషణ కర్తలను నియోగించడం, తిరుగుబాటు నిరోధక సైనిక కార్యకలాపాలు మొదలైనవి ప్రభుత్వం తిరుగుబాటు సమస్య పరిష్కారానికి అనుసరించిన వ్యూహాలు. అయితే. ప్రభుత్వం అనుసరించిన ఆ విధానాలు ఫలితాలను ఇచ్చాయి. జయప్రదంగా ఒప్పందం కుదుర్చుకున్న తరువాత అనేక తిరుగుబాటు సంస్థలు లొంగిపోయాయి. ఆ ఒప్పందం కొత్త రాష్ట్రం, రాజ్యాంగం ఐదవ లేక ఆరవ షెడ్యూల్ కింద రాష్ట్రం పరిధిలోనే స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతం ఏర్పాటుకు దారితీసింది. అయితే, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు ధోరణి విష వలయం నెమ్మదించడం లేదు. పూర్వపు గ్రూపులు ప్రధాన స్రవంతిలో కలసిపోయిన మరుక్షణం కొత్తగా తీవ్రవాద వర్గాలు ఆవిర్భవిస్తున్నాయి.

పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి విదేశీ జాతీయుల చొరబాటుకు వ్యతిరేకంగా 1979లో మొదలై ఆరు సంవత్సరాలు సాగిన అస్సాం ఉద్యమం ఈశాన్య భారత చరిత్రలో సుదీర్ఘ సాంఘిక అశాంతుల్లో ఒకటిగా నిలిచింది. చారిత్రక అస్సాం ఒప్పందంపై సంతకాలు జరగడంతో ఆ ఉద్యమం 1985లో అంతమైంది. ఆ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువ నాయకులు పూర్వపు అసమ్ గణపరిషత్ (ఎజిపి) పేరిట ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసిన తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. అస్సాం ప్రజల కోసం స్వతంత్ర సార్వభౌమ దేశం ఏర్పాటు డిమాండ్‌తో ‘అస్సాం సమైక్య విమోచన కూటమి (ఉల్ఫా) పేరిట అస్సాంలో బలమైన తిరుగుబాటు గ్రూప్ ఆవిర్భావానికి అస్సాం ఉద్యమం వీలు కల్పించింది. అగ్రశ్రేణి నాయకులు అనేక మంది తమ అనుచరులతో కలసి ప్రభుత్వానికి లొంగిపోయి ప్రధాన స్రవంతిలో కలిశారు. కానీ, ఒకింత బలహీనపడిన ప్రధాన గ్రూప్ మాత్రం తమ కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బారువా అలియాస్ పరేష్ అసమ్ నాయకత్వంలో ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నది.

మణిపూర్ హింసాకాండ

గడచిన 16 మాసాలుగా హింసాత్మక జాతి ఘర్షణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మణిపూర్ ఇండియన్ యూనియన్‌లో చేరినప్పటి నుంచి పలు జాతుల ఘర్షణలు చూసింది. మణిపూర్‌లో వివిధ భౌగోళిక ప్రాంతాల్లో జనాభా పంపిణీ విలక్షణమైనది. ప్రధానమైన హిందువుల వర్గం మైతైలు మణిపూర్ జనాభాలో 53 శాతం ఉంటారు. కానీ వారికి రాష్ట్రంలోని లోయలో 10 శాతం మాత్రమే భూమి ఉన్నది. మరొక వైపు కుకీలు, నాగాలు చాలా వరకు పర్వత ప్రాంతాల్లో 90 శాతం స్థలాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. వారిలో చాలా మంది క్రైస్తవులు. రాష్ట్ర జనాభాలో వారు 40 శాతం ఉంటారు. తాము అధిక సంఖ్యాకులు అయినందున మైతైలకే శాసనసభలో అధిక శాతం ప్రాతినిధ్యం ఉన్నది. అది మైతై ఆధిపత్య తత్వాన్ని ప్రోత్సహిస్తోంది. మెజారిటీ సమాజం చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం, ప్రాంతీయ, పాలకవర్గ సమగ్రతకు ముప్పు భావన. జాతుల గ్రూపుల్లో వేర్వేరు మతపర అస్తిత్వం నమ్మకం లోటును సృష్టించింది.

మైతై ఆధిపత్యవాద తత్వం మణిపూర్‌లో రాజకీయాలను, సామాజిక సంబంధాలను ప్రభావితం చేసింది. మైతై ముఖ్యమంత్రులు గడచిన 34 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. కుకీలు, నాగాల్లో పెరుగుతున్న అసమ్మతికి అది ఒక కారణంగా ఉన్నది. రాష్ట్ర బడ్జెట్, అభివృద్ధి పథకాల్లో అత్యధిక భాగం మైతై ఆధిక్యం గల ఇంఫాల్ లోయపైనే కేంద్రీకృతం అవుతున్నాయని మణిపూర్ మైనారిటీలు ఆరోపించారు. అధికారం, అభివృద్ధి పంపిణీలో అసమతుల్యం, జీవన ప్రదేశాల కోసం పోటీ మణిపూర్‌లో వివాదానికి ప్రధాన కారణం. గతంలో నాగాలు, కుకీ జోల మధ్య, నాగాలు, మైతైల మధ్య హింసాత్మక ఘర్షణల సందర్భాలు ఉన్నాయి. మైతైలు, పంగల్ (ముస్లిం) మైతైల మధ్య అంతర్గత వర్గ దౌర్జన్య సంఘటనలు కూడా 1993లో జరిగాయి.

వాటిలో సుమారు 100 మంది మృతి చెందగా, అనేక మంది నిర్వాసితులయ్యారు. 1997 98లో కుకి పైలే లేదా కుకి జోమి వివాదం వంటి అంతర్‌వర్గ ఘర్షణ కూడా జరిగింది. దానిలో 352 మంది మరణించారు. 13 వేల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఈశాన్యంలోని తిరుగుబాటు గ్రూపులు అన్నిటికీ విదేశీ శక్తుల ప్రాపకం ఉన్నది. తుపాకులు, మాదకద్రవ్యాల సరఫరా, ఆశ్రయం, విదేశీ భూభాగంలో శిక్షణ వంటివి ఆ శక్తులు సమకూరుస్తున్నాయి. తీవ్రవాద సంస్థలు ఒకటి లేదా అంతకు మించిన దేశాల నుంచి, ముఖ్యంగా మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా నుంంచి కార్యకలాపాలు సాగిస్తుంటాయి. నల్లమందు సేద్యం, లక్షిత జాతివర్గంపై దాడికి డ్రోన్ వినియోగం, మయన్మార్ నుంచి కుకి జో ప్రజలు పెద్ద ఎత్తున చొరబడడం వాస్తవంగా తీవ్ర వివాదంలో పైపై మెరుగు అంశమే.

మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆధిపత్యవాద పాత్ర, తీవ్రవాడుల గ్రూప్‌ను దాదాపుగా రాష్ట్రాన్ని పాలించేందుకు అనుమతించడం, మతపరంగా, జాతులపరంగా ప్రాబల్య వర్గాలను పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలను కైవసం చేసుకోనివ్వడం రాజధర్మం, మానవ హక్కుల ఉల్లంఘనే. కేంద్ర ప్రభుత్వ నిష్క్రియపరత్వం, మణిపూర్‌పై ప్రధాని దీర్ఘకాలిక మౌనముద్ర, బిజెపి ప్రభుత్వాల మతతత్వం, పాలనలో అసమర్థతను ప్రదర్శించాయి. రాష్ట్రంలో చిరకాల శాంతి కోసం రెండు ప్రత్యర్థి వర్గాలను చర్చల వేదికకు తీసుకురావడం, ఉభయ పక్షాల సాంఘిక సంస్థలకు పాత్ర కల్పించడం ఏకైక పరిష్కార మార్గం. అయితే, ఢిల్లీ గాని, ఇంఫాల్ గాని ఈ మార్గాన్ని ఎన్నడూ ఎంచుకోలేదు. మతతత్వ, కులతత్వ, సంకుచిత రాజకీయ దృక్పథాలతో సమ్మిళితమైన ఆధిపత్య భావన ఈ సంఘర్షణ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. సంపూర్ణమైన, సమతావాద, మానవతావాద దృక్పథం, సామాజిక చర్చ మాత్రమే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతిని, ప్రగతిని సాధించగలవు.

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News