Friday, September 20, 2024

2014-24: రాజ్యాంగ విధ్వంసక దశాబ్ది

- Advertisement -
- Advertisement -

మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ గతంలో ఎమెర్జెన్సీ ప్రకటించిన రోజును, అంటే జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినం (సంవిధాన్ హత్యా దివస్) అని అంటున్నారు హోం మంత్రి అమిత్ షా. బిజెపి పాలనలో జరిగిన అరాచకాలను గుర్తు చేసుకుంటూ ‘రాజ్యాంగ విధ్వంసక దశాబ్ది (2014-2024)గా ఈ దేశ ప్రజలు గుర్తించారు. ఇక రోడ్డు మీదికి వచ్చి నిరసనలు తెలియజేయడమే తరువాయి. అది త్వరలో జరుగుతుందని ఆశిద్దాం! గోడి మీడియాలో హెడ్‌లైన్ కోసం మోడీ షాలు తాపత్రయపడడం ఈ ప్రకటనలో కనిపిస్తుంది తప్ప, ‘సంవిధాన్ హత్యా దివస్’లో పస లేదు. పైగా ‘హత్య’ అనేది మోడీ, షాలకే కాదు, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వారికి చాలా ఇష్టమైన పదం. ఒక్కసారి గతంలోకి చూడండి తెలుస్తుందది. జాతిపిత గాంధీని హత్యచేసిన వారెవరూ? వారి నాయకుడే అయిన దీన్ దయాళ్ ఉపాధ్యాయను మట్టుబెట్టింది ఎవరో తెలుసుకోండి. జస్టిస్ లోయ హత్య గురించి తెలుసుకోండి. కొన్ని కొన్ని హత్యల వివరాలు బయటపడవు.

కాని, హత్య అనేది ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలకు చాలా ప్రీతిపాత్రమైన పదం. అలాంటిది నిర్వహించడం కూడా బహుశా వారికి వారి శాఖల్లో తర్ఫీదు ఇస్తారేమో! సంవిధాన్ హత్యా దివస్ ప్రకటించగానే, ఉద్ధవ్ థాక్రే గ్రూపు శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇలా అన్నారు ‘ఎమర్జెన్సీ అంటే ఏమిటో ఈ దేశ గృహ మంత్రికి తెలియదనుకుంటా. దేశంలో ఎమర్జెన్సీ విధించబడ్డప్పుడు ఆయన వయసు ఎంతో నాకు తెలియదు. బాలా సాహెబ్ థాక్రే పార్టీ శివసేనను చీల్చి ఒక నకిలీ శివసేన ముఠాతో చేతులు కలిపి సయ్యాటలాడే వారికి బాలా సాహెబ్ థాక్రే దార్శనికత ఏం అర్థమవుతుందీ? అంతటి ఆ బాలా సాహెబ్ థాక్రేనే ఆనాడు ఎమర్జెన్సీకి ఇందిరా గాంధీకి పూర్తి మద్దతు ప్రకటించాడు. ఆ మాత్రం పరిజ్ఞానం లేని వారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకోవాలి!” అని.

పార్లమెంటులో విపక్షం ఇండియా కూటమి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని బలంగా నొక్కి చెప్పింది. బిజెపి విధానాలను ఎండగట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎల్లవేళలా రాజ్యాంగం ప్రతిని పట్టుకుని తిరుగుతున్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ప్రతిని బహూకరిస్తున్నారు. దేశ ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుతున్నారు. దానితో ప్రజల్లో ఒక చైతన్యం పెల్లుబుకుతోంది. నైతికంగా దిగజారిన మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చామని విర్రవీగనక్కరలేదు. వాస్తవంగా వారికి వచ్చినవి 130 సీట్లే. మోసపూరితంగా ఇవిఎంల టాంపరింగ్‌తో మరో వంద పెరిగాయి. ఇది బహిరంగ రహస్యం. అయినా కూడా పార్లమెంటులో (జూన్ 2024) తగినంత బలం లేదు. వెన్నుపోటుదారుల్ని, మోసకారుల్ని ఊతకర్రల్లాగా చంకలో వేసుకుని మోడీ ప్రభుత్వం కుంటుతూ నడుస్తోంది.

ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చని విజ్ఞులైన విశ్లేషకులు చెబుతున్నారు. కార్పొరేట్లు దొంగబాబాలు కూడా మోడీ ప్రభుత్వానికి ఊతకర్రలే. దేశంలో ప్రధాన మీడియా ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఒక సంఘటనను పరిశీలిద్దాం. అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి, రాధిక మర్చెంట్‌తో 12 జులై 2024న జరిగింది. అందుకోసం దాదాపు 13 బిలియన్లు ఖర్చు చేశారని వార్తలొచ్చాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని, రాహుల్ గాంధీ బలమైన ప్రతిపక్ష నేతగా ఎదిగారని గ్రహించిన అంబానీ, పెళ్లి పత్రిక పట్టుకుని ఢిల్లీలోని 10, జనపథ్‌కు వెళ్లాడు. సోనియా గాంధీని కలిశాడు. గంటసేపు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడాడు. కాని అక్కడ రాహుల్ గాంధీ జాడ కనబడలేదు.

అంబానీని కలవడం ఇష్టం లేని రాహుల్ గాంధీ ఇంట్లో లేకుండా అక్కడికి 50 కి.మీ దూరంలో తాపీ మేస్త్రీలతో నిర్మాణ పనులకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ, వారితో కలిసి పనులు చేస్తూ గడిపాడు. దీనితో స్పష్టంగా ఆయన ఈ దేశ ప్రజలకు చెప్పదలుచుకున్న విషయమేమంటే రాజకీయ నాయకులు జనంలో ఉండాలి. జనం కోసం ఉండాలి! మోడీ, షాల వలే కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, వారి ఇళ్ల ముందు పాలేర్లుగా బతకొద్దు అని! దీనిలో మరో విషయం కూడా ఉంది. అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లిని ప్రధాన మీడియా ఒక జాతీయ కార్యక్రమంలా చూపించింది. అంబానీని పట్టించుకోకుండా ప్రజలతో కలిసి, తన పని తాను చేసుకుపోయిన రాహుల్ గాంధీని ఏ టివి ఛానలూ చూపించలేదు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ఇవ్వగూడదో ఇక ఇప్పుడైనా ప్రధాన మీడియా నేర్చుకోవాలి లేదా పంథా మార్చుకోవాలి.

రాహుల్ గాంధీ చర్య కార్పొరేట్ల అహంకారం మీద దెబ్బ కొట్టినట్లయ్యింది. బిజెపి ఏర్పరిచిన ఒక తప్పుడు విధానాన్ని మార్చి తనకై తాను ప్రజల పక్షాన నిలబడ్డట్టయ్యింది. ‘నఫ్త్‌క్రి రాస్తోంపే మొహోబ్బత్‌కి దుకాన్ ఖోల్ తే జాయెంగే’ (మీ విద్వేషపు రహదారుల్లో మేం ప్రేమ దుకాణాలు తెరుచుకుంటూ వెళతాం) అని చెప్పినట్లే రాహుల్ గాంధీ రెండు సార్లు దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. జనాల నాడి తెలుసుకున్నారు. వారి అవసరాలేమిటో అర్థం చేసుకున్నారు. ఇది గొప్ప పరిణామం కదా? ఇతర నాయకులందరికీ భిన్నంగా ప్రవర్తిస్తూ తన ప్రత్యేకతను తాను నిలుపుకున్నారు కదా? ప్రజా స్పందన, ఎన్నికల ఫలితాలూ అన్నీ అనుకూలంగా వస్తున్నాయి. దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించడం మనం చూశాం. విద్వేషాలు రెచ్చగొట్టిన బిజెపికి ప్రజలు అంచెలంచలుగా బుద్ధి చెపుతూ వస్తున్నారు. రాహుల్ గాంధీ మణిపూర్‌లో రెండుసార్లు పర్యటించి, తను వారికి అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు.

గుజరాత్‌లోనూ విస్తృతంగా పర్యటించారు. మోడీ, షాలను వారి గుజరాత్‌లోనే ఓడించి బుద్ధి చెపుతామని పార్లమెంటులోనే ప్రకటించారు. ఇక ప్రధాని మోడీ, ఒక్కసారి కూడా మణిపూర్ సందర్శించలేదు. దేశ ప్రజల విశ్వాసం కోల్పోతూ, క్రమంగా బలహీనపడడానికి అదీ ఒక కారణం! మరో ముఖ్యమైన విషయమేమంటే ఇటీవల (జులై 2024) రష్యా వెళ్లిన ప్రధాని మోడీ దేశానికున్న పరువూ, గౌరవం తీసేసి వచ్చారు. 2014 వరకు దేశంలో శాంతి భద్రతలు లేవని, దేశ ప్రజలు భయభ్రాంతులై గడిపేవారనీ అక్కడి భారతీయ సమూహాన్ని ఉద్దేశించి మట్లాడుతూ చెప్పారు. పదేళ్లుగా తాను చేసిన నిర్వాకం అక్కడి వారికి తెలియదనుకున్నారు పాపం! ప్రపంచం కుగ్రామమైంది. ఎక్కడ ఏం జరిగినా ప్రపంచమంతా తెలిసే సాంకేతిక యుగంలో మనమున్నామన్న సంగతి కూడా మరిచి, నోటి కొచ్చింది మాట్లాడితే ఎలా? చదువూ విజ్ఞతాలేని వాడి ఆలోచనలు ఇలాగే దిగజారి ఉంటాయి. ప్రధాని స్థానంలో ఉండి దేశానికున్న పరువు మంటగలిపే విధంగా మాట్లాడొచ్చా? హుందాతనం ఏదీ? దేశంలో మీడియాను మోడీ తన ఆధీనంలో ఉంచుకుంటే ఉంచుకున్నాడు గాక విదేశీ మీడియా ఊర్కోదు. శక్తిపుంజుకున్న యూట్యూబ్ ఛానళ్లూ ఊరుకోవు. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ మోడీ రష్యా పర్యటనను తీవ్రంగా నిరసించాడు. ‘ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యపు దేశాధినేత మాస్కో వెళ్లి, అక్కడి రక్తపిపాసిని (పుతిన్‌ని) కౌగలించుకోవడం నిరాశ కలిగించింది’ అని ఇంకా తీవ్ర పదజాలంతో విమర్శించాడు.

అయితే ఇదే జెలెన్ స్కీని నరేంద్ర మోడీ ఆ మధ్య ఇటలీలో కలిసినప్పుడు ఇలాగే కౌగలించుకున్నారు. ఒక ఆలోచనా విధానమేమీ లేని వాడి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఉక్రెయిన్ పిల్లల ఆసుపత్రి మీద రష్యా బాంబులు పడి అనేక మంది చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే మోడీ రష్యా నేల మీద కాలు మోపాడు. ‘యుద్ధం శాంతికి పరిష్కారం కాదు’ అని ఒక గొప్ప విషయం పుతిన్‌కు హితబోధ చేశారు. అతిథిగా వచ్చినవాణ్ణి అవమానపరచడం సభ్యత కాదని పుతిన్ మౌనంగా ఉండిపోయాడేమోగాని, అతను గనక గుజరాత్, మణిపూర్ మారణహోమాల్ని గుర్తు చేసి ఉంటే మోడీ ముఖం ఎక్కడ పెట్టుకునేవారో తెలియదు. మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే ఉలుకూ పలుకూ లేని వారికి శాంతి వచనాలు పలికే అర్హత ఉందా? విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు ‘యుద్ధ దేశం నుండి కాదు, బుద్ధుడి దేశం నుండి వచ్చానని చెప్పుకునే మోడీకి అసలు బుద్ధుడి పేరెత్తే అర్హత ఉందా? మత విద్వేషాలు రేపి, దేశంలో మారణ హోమాలు సృష్టించే ఒక అహంకారికి బుద్ధుడి పేరెత్తే అర్హత ఎలా ఉంటుందీ?

మోడీ రష్యాలో పుతిన్ ఎదురుగా కూర్చుని శాంతి వచనాలు వల్లిస్తున్నప్పుడే, రష్యా ఉక్రెయిన్‌పై మిస్సైల్స్ ప్రయోగించింది అంటే పుతిన్ మోడీని గౌరవించినట్టా, అవమానించినట్టా? ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. భారతీయ సనాతన ధర్మాన్ని అభిమానించి, ఆరాధించే భారత ప్రధానికి రష్యా సనాతన మత బోధకుడైన సెయింట్ ఆండ్రూ పేరున ఉన్న పురస్కారం లభించింది. అది చూసుకుని మోడీ తనకు తాను సంతోషించాల్సిందే! భారతీయులెవరూ గర్వించలేదు. ప్రధాని మోడీ తన స్థాయి ఏమిటో ఆలోచించుకోకుండా లోక్‌సభ ఎలక్షన్ సభలో (2024) ప్రసంగిస్తూ “అదానీ, అంబానీలు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి బస్తాల్లో డబ్బు కుక్కి కుక్కి ట్రక్కులు నింపి పంపారని” అన్నారు. అంటే ఏమిటీ? అదానీ, అంబానీలు దోషులని, దేశద్రోహులని ఆరోపించినట్టే కదా? మరి అలాంటి ముఖేష్ అంబానీ ఇంట్లో పెండ్లికి మోడీ తగుదునమ్మా అని వెళతారా? అని ఈ దేశ ప్రజలు అడగడం కాదు, మండిపడుతున్నారు. సమాధానం చెప్పుకోవాలి కదా? ఎందుకు చెప్పుకోలేదు? మోడీ ప్రభుత్వం, ఈ దేశ ప్రజల సొమ్మును కార్పొరేట్లకు ముఖ్యంగా అదానీ, అంబానీలకు దోచిపెడుతూ ఉందని ఈ దేశ ప్రజలకు తెలుసు. చదువులేని వాడని అనుకున్నారే గాని, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేనివాడు తమకు ప్రధానిగా ఉన్నారా? ఇలాంటి వారికా తాము అంతటి ఉన్నత స్థాయినిచ్చాం? అని ప్రజలు తమలో తాము కుమిలిపోతున్నారు.

బుద్ధుడు, బ్రూనో, డార్విన్, మార్క్, ఫూలేలు చేసిన త్యాగాల ముందు అంబానీ పెళ్లి పేరుతో ఆర్భాటంగా, అసహ్యంగా, వికృతంగా చేసిన బిలియన్ల డబ్బు ఖర్చు ఎందుకు పని కొస్తుందీ? ఆ మహనీయుల కాలిగోటితో కూడా సమానం కాదు. అసలు పోలికే అసమంజసం నిజమే! కాని, అన్ని బిలియన్ల డబ్బు ఖర్చు చేయడం వల్ల దేశానికి గాని, సమాజానికి గాని ఏ మాత్రం ఉపయోగం జరుగలేదు. వృథా! వృథా!! అదేమైనా నిజాన్ని నిలుపడానికా?మానవీయ విలువల్ని నిలుపడానికా? పేదల సంక్షేమం కోసమా? పర్యావరణ పరిరక్షణకా? ఎందుకు అంత డబ్బు ఖర్చు చేసినట్టూ? అతని డబ్బు అతని సంతోషం కోసం ఖర్చు చేసుకున్నాడని అంటారేమో. అన్యాయంగా ప్రజల్ని కొల్లగొట్టి సంపాదించిందే కదా? కార్పొరేట్ల దగ్గర ఉన్నదైనా, ప్రభుత్వాల దగ్గర ఉన్నదైనా అంతా ప్రజల సొమ్మేనన్న విషయం ఎవరూ మరిచిపోగూడదు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అతని కుటుంబ సభ్యులు తప్ప, మిగతా రాజకీయ పార్టీ నాయకులంతా అంబానీ ఆర్భాటంలో భాగస్వాములయ్యారు. ఆయన మాత్రం అంబానీ, మోడీల అహంకారంపై దెబ్బ తీస్తూ సామాన్యుల ప్రతినిధిగా ఒంటరిగా నిలబడ్డారన్నది ఈ దేశ ప్రజలు గమనించారు.

డాక్టర్
దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News