Sunday, September 22, 2024

గంజాయి విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగి ..ఐఐటీ విద్యార్థి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఆరెంకల జీతం, ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఉన్నత విద్య(ఐఐటి) చదువును మధ్యలో ఆపివేసిన మరో విద్యార్థి గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శనివారం అరెస్టు చేశారు. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద నుంచి 2.94కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…ఎపి రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, అల్లంపాడుకు చెందిన ఎర్రగంటి లోకేష్ మణికొండలో ఉంటూ నగరంలో ఓ ఐటి కంపెనీ పనిచేసేవాడు. గంజాయికి బానిసగా మారడంతో సంస్థ ఉద్యోగం నుంచి తీసివేసింది. గంజాయి తీసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో గంజాయి విక్రయదారుడిగా అవతారం ఎత్తాడు. ధూల్‌పేట తదితర ప్రాంతాల్లో నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి 20 గ్రాముల గంజాయిని రూ.2,000లకు విక్రయిస్తున్నాడు. మణికొండ ప్రాంతంలో ఒక గృహంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది దాడులు చేశారు.

దాడుల్లో లోకేష్ ఇంట్లో 1.74కిలోల గంజాయి లభించింది. లోకేష్‌కు గంజాయి కూకట్‌పల్లిలో ఉంటున్న నెల్లూరుకు చెందిన శ్రీకాంత్ గంజాయి సరఫరా చేస్తున్నాడు, అతడిపై కూడా ఎక్సైజ్ సిబ్బంది కేసు నమోదు చేశారు. కాగా ఎస్‌ఆర్ నగర్‌లోని పిజి హాస్టల్‌పై దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.2 కేజీల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని గుంటూరు జిల్లా, మాచర్లకు చెందిన పవన్, నెల్లూరు జిల్లా, కనుకలగుంటకు చెందిన కొలి మణికంఠ చౌదరి కలిసి గంజాయి విక్రయాస్తున్నారు. ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్న పవన్ గంజాయికి బానిసగామారి చదువును మధ్యలో ఆపివేశాడు. ఎస్‌ఆర్ నగర్‌లోని వినాయక ఎగ్జిక్యూటీవ్ పిజి హాస్టల్‌లో ఉంటూ గంజాయి విక్రయిస్తున్నాడు. గంజాయికి బానిసగా మారిన పవన్ చదువును ఆపివేశాడు. గంజాయి తీసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో గంజాయి ఎపిలోని అరకుకు చెందిన కమలేష్, అమోష్ వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంలో 20గ్రాములను వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నాడు.

పిజీ హాస్టల్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది హాస్టల్‌పై దాడి చేసి అరెస్టు చేశారు. వీరి నుంచి గంజాయిని కొనుగోలు చేసిన 22 మందిని గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది వారిపై కేసులు నమోదు చేశారు. వీరికి గంజాయి సరఫరా చేసిన విశాఖ, అరకుకు చెందిన కమలేష్, అమోష్‌లపై కూడ కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. గంజాయి పట్టుకున్న వారిలో సిఐ ఎంపిఆర్ చంద్రశేఖర్, ఎస్సై సాయి కిరణ్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు భాస్కర్‌రెడ్డి, శ్రీధర్, అజీమ్, కానిస్టేబుళ్లు ప్రకాష్, రాకేష్, అశ్విన్, అహ్మద్ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News