Tuesday, September 24, 2024

10 వేల మందికి నైపుణ్య శిక్షణ

- Advertisement -
- Advertisement -

డిగ్రీతో పాటు బిఎఫ్‌ఎస్‌ఐ మినీ డిగ్రీ
20 ఇంజనీరింగ్, 18 డిగ్రీ కాలేజీల ఎంపిక
ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు
ఉచితంగా ఖరీదైన కోర్సు.. జాబ్ గ్యారంటీ లక్ష్యం
25న ప్రారంభించనున్న సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వేలాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణను అందించేందుకు ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బిఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లోని ఐటి, ఐటిఇఎస్ నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేండ్లుగా హెచ్‌ఎస్‌బిసి, జెపి మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్చేంజీ వంటి బిఎఫ్‌ఎస్‌ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బిఎస్‌ఎఫ్‌ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్‌ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. అందుకే కొత్తగా ఏర్పడే గ్లోబల్ కెపబులిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ రంగంలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించటం భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు శిక్షణకు ఖర్చు చేస్తున్నాయి. శిక్షణ పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ సంస్థలో పని చేస్తారా.. లేదా.. ఎక్కువ ప్యాకేజీలకు మరో సంస్థకు వెళుతారా.. అనేది కూడా గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు ప్రధాన సవాలుగా మారింది. అందుకే పరిశ్రమల అవసరాలను, ఇప్పుడున్న సవాళ్లను అధిగమించేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ప్రదర్శించారు. జనవరిలోనే బిఎఫ్‌ఎస్‌ఐ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ డిమాండ్‌కు అవసరమైన ఉద్యోగాల కల్పించే దిశగా యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటుగానే నైపుణ్య డిగ్రీ కోర్సును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో భాగంగానే రాష్ట్ర ఉన్నత విద్యామండలి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఖరీదైన ఈ మినీ డిగ్రీ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసింది. రెగ్యులర్ డిగ్రీ కోర్సుతో పాటుగానే దీన్ని విద్యార్థులకు నేర్పిస్తుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఉన్నత విద్యామండలి ఎంపిక చేసిన 20 డిగ్రీ కాలేజీలు, 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కోర్సులను నిర్వహిస్తుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ కోర్సులను ప్రారంభిస్తోంది. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రారంభిస్తారు. 5 వేల మంది ఇంజనీరింగ్, 5 వేల మంది నాన్ ఇంజనీరింగ్… మొత్తం 10 వేల మంది విద్యార్థులకు ఈ వర్క్ కోర్సు నేర్పించనున్నారు.

విద్యారులపై ఫీజుల భారం లేకుండా ఖరీదైన కోర్సులు
అత్యంత ఖరీదైన కోర్సు కావటంతో రివాల్వింగ్ ఫండ్‌తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సిఎస్‌ఆర్) నిధులతో ఈ ప్రోగ్రాం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకపోవటంతో పాటు విద్యార్థులకు ఖరీదైన ఫీజుల భారం ఉండదు. ఇప్పటికే వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇక్యూయుఐపిపిపి అనే సంస్థను ఈ ప్రోగ్రాం నిర్వహణకు ఎంపిక చేశారు. అటు బిఎఫ్‌ఎస్‌ఐ సంస్థలతో అనుసంధానానికి, మరోవైపు ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది.

తొలి విడతగా ఈ సంస్థ రూ.2.50 కోట్లను అందించేందుకు సిద్ధపడింది. ప్రతి ఏడాది పది వేల మంది విద్యార్థులకు మూడేండ్ల పాటు అవసరమయ్యే రివాల్వింగ్ ఫండ్‌ను ఈ సంస్థ సమీకరిస్తుంది. డిగ్రీ కాలేజీల్లో బిఎఫ్‌ఎస్‌ఐ కోర్సులో భాగంగా స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్స్, జనరిక్ ఎలెక్టివ్స్(జిఇ) పాఠ్యాంశాలను పరిచయం చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో దీన్ని మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్, యాక్సిలరేటెడ్ కోర్సుగా అందిస్తారు. ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్, పాఠ్యాంశాలను బిఎఫ్‌ఎస్‌ఐ కన్సార్టియం తయారు చేసింది. ఈ పాఠ్య ప్రణాళికను బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదించింది. డిగ్రీతో పాటు ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్‌తో పాటు, అర్హులైన వారందరికీ ఇంటర్స్‌షిప్‌తో పాటు ఉద్యోగం లభించేలా ఈ ప్రోగ్రాం రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News