Saturday, September 28, 2024

వచ్చే నాలుగేళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : దశాబ్దాలుగా వెనుకబడిన, వలసలకు పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ ఈ శాసనసభ కాలంలోనే పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒకరోజు ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన, సమీక్షల నిమిత్తం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థ్ధిక, నీటి పారుదల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా ప్రతినిధులతో కలిసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నియోజకవర్గం పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్‌ను బుధవారం సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్షమని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ ఆర్‌కు రూ.45 కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు కోయిల్‌సాగర్ సహా అన్ని ప్రాజెక్టులను 100కి నూరు శాతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉదండాపూర్‌తో పాటు, ఇతర రిజర్వాయర్లతో ముంపునకు గురైన వారికి న్యాయపరంగా పునరావాసం అందిస్తామని, వీటన్నింటిపై సమీక్షించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన చేపట్టినట్లు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ.. ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ ఆర్‌కు రూ.45 కోట్ల నిధులను విడుదల చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి జడ్చర్ల ఎంఎల్‌ఎ అనిరుధ్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలోమంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News