Friday, September 27, 2024

రాజీనామా చేయను, ఏ తప్పూ చేయలేదు:సిఎం సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను రాజీనామా చేయబోనని గురువారం పునరుద్ఘాటించారు. మైసూరు పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎంయుడిఎ ముడా) తన భార్యకు 14 స్థలాలు కేటాయించడంలో ఎటువంటి తప్పూ జరగలేదని సిద్ధరామయ్య మళ్లీ స్పష్టం చేశారు. తనపై ఆరోపణలను ‘బిజెపి కుట్ర’గా సిద్ధరామయ్య పేర్కొంటూ, తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ముడా స్థలం కేటాయింపు ‘కుంభకోణం’లో ముఖ్యమంత్రిపై మైసూరులోని లోకాయుక్త పోలీసులు దర్యాప్తు జరపాలని బెంగళూరులోని ఒక ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశించడంతో ఆయనపై ఒక ఎఫ్‌ఐఆర్ నమోదుకు వేదిక సిద్ధం చేసినట్లు అయింది. సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేసే అవకాశం లేదని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ కూడా స్పష్టం చేశారు. కర్నాటకలో ప్రతిపక్ష బిజెపి సిద్ధరామయ్య రాజీనామా కోరుతూ బెంగళూరులో విధాన సౌధ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించింది.సిద్ధరామయ్య బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, ‘నేను ఏ తప్పూ చేయలేదు కనుక రాజీనామా చేసే ప్రశ్నే లేదు. ఇవి (తనపై గల ఆరోపణలు) బిజెపి (కుట్ర)’ అని అన్నారు.

‘(అప్పట్లో) ఎఫ్‌ఐఆర్ దాఖలైనందున గోధ్రాఘటనలో ప్రధాని (అప్పటి గుజరాత్ సిఎం నరేంద్ర మోడీ) రాజీనామా చేశారా? (హెచ్‌డి) కుమారస్వామి (జెడిఎస్ నేత) నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన బెయిల్‌పై ఉన్నారు, ఆయన రాజీనామా చేశారా?’ అని ముఖ్యమంత్రి అడిగారు. ‘వారు రాజీనామా చేశారా? వారు ఇరకాట స్థితి ఎదుర్కొనలేదా? నేను రాజీనామా చేయను. చట్టపరంగా పోరాడుతాను’ అని సిద్ధరామయ్య అన్నారు. ‘నేను రాజీనామా చేయను, వారిని కుమారస్వామి రాజీనామాను పొందనివ్వండి, ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఆయన ఎవరి క్యాబినెట్‌లో, ఏ ప్రభుత్వంలో ఉన్నారు? ఆయన (మొదట రాజీనామా) చేయాలి. నరేంద్ర మోడీ రాజీనామా చేశారా? వందలాది మంది మరణిస్తున్నా, ఆయన రాజీనామా చేయలేదు. నేను తప్పు ఏమీ చేయలేదు, రాజీనామా చేయవలసిన అవసరం నాకు లేదు’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి రాజీనామాకు ప్రతిపాదన రాబోదని చెబుతున్నాను. ఇది బిజెపి, జెడి (ఎస్) పన్నిన రాజకీయ కుట్ర. మా ఐదు గ్యారంటీ పథకాలు ప్రజలకు చేరుకుంటుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని శివకుమార్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News