Friday, September 27, 2024

వూహాన్‌లో అణు ముప్పు

- Advertisement -
- Advertisement -

రేవులో కుప్పకూలిన అణుశక్తి జలాంతర్గామి
అటువంటి సమాచారం తమ వద్ద లేదన్న వాషింగ్టన్‌లో చైనా ఎంబసీ

బీజింగ్/ వాషింగ్టన్ : అణుశక్తి విస్తరణ కార్యకలాపాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు తీవ్ర విఘాతం ఎదురైనట్లు తెలుస్తోంది. చైనా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అణు జలాంతర్గామి మునిగిపోయిందని అమెరికన్ ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆ వర్గాలు ఈ విషయం తెలియజేశాయి. మ్యాక్సర్ టెక్నాలజీస్ మార్చి 10న తీసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం, వుహాన్ సమీపంలోని షిప్‌యార్డ్ వద్ద ఆ జలాంతర్గామిని చైనా నిలిపి ఉంచింది. జూన్ చిత్రాల్లో మాత్రం ఆ జలాంతర్గామి మళ్లీ తీరం వద్దకు తిరిగి రాలేదు. ‘అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఝౌ క్లాస్‌లోని తొలి జలాంతర్గామి తీరం సమీపంలో మునిగిపోయిందనే విషయాన్ని దాచేందుకు పిఎల్‌ఎ ప్రయత్నిస్తోంది’ అని అమెరికన్ రక్షణ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

చైనా షిప్‌యార్డ్‌లకు సంబంధించిన ఉపగ్రహ దృశ్యాలను పరిశీలించే టామ్ షుగార్ట్ ఆ విషయాన్ని గుర్తించారు. ఆయన సెంటర్ ఆఫ్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నేను ఒకే చోట భారీ సంఖ్యలో క్రేన్లను చూడలేదు. ఉపగ్రహ దృశ్యాలను చూస్తే ఒక క్రేన్ మాత్రమే కనిపించింది. సాధారణంగా జలాంతర్గాములను లాంచ్ చేసిన తరువాత అవి కొన్ని నెలల పాటు షిప్‌యార్డ్ వద్ద ఉంటాయి. కానీ అక్కడ మాత్రం అలా జరగలేదు’ అని టామ్ తెలిపారు. జలాంతర్గామి మునిగిపోయిన విషయాన్ని పిఎల్‌ఎ రహస్యంగా దాచిపెట్టడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని యుఎస్ రక్షణ శాఖ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అయితే, జలాంతర్గామి మునిగిపోవడంపై తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒకరు తెలిపారు.

‘మీరు చెబుతున్న అంశం గురించి మాకు తెలియదు. చెప్పడానికి మా వద్ద ఎటువంటి సమాచారమూ లేదు’ అని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. అమెరికాకు దీటుగా తన సైన్యాన్ని (పిఎల్‌ఎను) ఆధునికీకరిస్తున్న చైనా నావికా జలాంతర్గామి విస్తరణకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తోంది. ఆ జలాంతర్గామి ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో క్వింగ్‌డావ్ నౌకాదళ స్థావరం ఉన్నది. అక్కడికి అమెరికా, బ్రిటన్ జలాంతర్గాములు రాకుండా ఎల్లో సముద్రంలో చైనా ఏర్పాటు చేసిన ‘చైన్,యాంకర్ ఉచ్చు’లో దాని జలాంతర్గామి చిక్కుకున్నట్లు ‘డైలీ మెయిల్’ కథనంలో తెలియజేసింది. చైనా నౌకాదళంఇటువంటి ఉచ్చులను వినియోగిస్తూ ఉంటుంది. ఆ ప్రమాదంపూ అప్పట్లో బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ స్పందించలేదు. కానీ ఆ ఘటన జరిగిందని నమ్మేందుకు బలమైన కారణాలు ఉన్నాయని బ్రిటన్ సబ్‌మెరైనర్ ఒకరు తెలిపారు. చైనా జలాంతర్గాముల్లో విపత్కర పరిస్థితుల్లో కార్బనడై ఆక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్‌ను ఉత్పత్తిచేసే కిట్లు లేకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News