Monday, September 30, 2024

లడ్డూ వివాదంపై చంద్రబాబుకు సుప్రీంకోర్టు నిలదీత

- Advertisement -
- Advertisement -

పూర్తి ఆధారాలు లేకుండా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యిని ఉపయోగించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎలా బహిరంగ ఆరోపణలు ఎలా చేస్తారని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. ఈ ఆరోపణలపై మీరే దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించిన సుప్రీంకోర్టు దేవుళ్లను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ సూచించింది. తిరుమల ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్‌న్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును ధర్మాసనం తప్పుపట్టింది. రాజ్యాంగపరమైన పదవులను నిర్వహించే వ్యక్తులపై మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

కేసు నమోదు లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు కావడానికి ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు ఈ వివాదంపై మాట్లాడారని ధర్మాసనం గుర్తు చేసింది. సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి ప్రకటన చేశారని, సెప్టెంబర్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని, సెప్టెంబర్ 26న సిట్ ఏర్పాటు జరిగిందని ధర్మాసనం వివరించింది. భక్తుల మనోభావాలను ప్రభావితం చేసే విధంగా అటువంటి ప్రకటన చేయవచ్చా అని ప్రశ్నించిన ధర్మాసనం దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆ విధమైన సమాచారాన్ని ప్రజలకు బహిర్గత పరచడం సమంజసం కాదని తాము ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది. సిట్ ఏర్పాటుకు ఆదేశించిన మీరు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ముఖ్యమంత్రిని ధర్మాసనం ప్రశ్నించింది. మీరు ఇటువంటి కేసుల పైనే హాజరవుతున్నారని, ఇది రెండవసారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి ధర్మాసనం తెలిపింది. ఇవి నిజాయితీతో కూడిన పిటిషన్లు కాదని రోహత్గి ఈ సందర్భంగా వాదించారు. ప్రస్తుత ప్రభుత్వంపై దాడి చేసేందుకు గత పాలకులు చేస్తున్న ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.

కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి వారికి సంబంధించిన సరఫరాదారులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) నోటీసులు జారీచేసిందని ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారి లూడ్డ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని నిర్ధారించేందుకు మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా టిటిడి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మరి అలాంటప్పుడు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం మీకు ఉంది అంటూ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. లడ్డూల తయారీకి కల్తీ నెయ్యిని ఉపయోగించారన రుజువుచేసే నివేదిక ఏదీ లేదని ధర్మాసనం తెలిపింది. లడ్డూలు రుచికరంగా లేవని భక్తులు ఫిర్యాదు చేశారని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకురాగా రుచిగా లేని లడ్డూలను లేబ్‌కు పంపించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. సాధారణంగా ఇటువంటి విషయాలలో రెండవ అభిప్రాయం కోరతామని, కాని కల్తీ అని చెబుతున్న నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించారని చెప్పేందుకు ఇక్కడ అధారాలు ఏవీ లేవని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు.

ఈ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించే విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు కోరవలసిందిగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి(గురువారం) వాయిదా వేసింది. బిజెపి నాయకుడు డాక్టఱ సుబ్రమణియన్ స్వామి, రాజ్యసభ సభ్యుడు, టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చరిత్కారుడు విక్రమ్ సంపత్, ఆధ్యాత్మిక ప్రవచనకర్త దుష్యంత్ శ్రీధర్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News