Tuesday, October 8, 2024

జెకె ముఖ్యమంత్రి ఒమర్

- Advertisement -
- Advertisement -

ఎన్‌సి చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటన

శ్రీనగర్ : ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించారు. మిత్ర పక్షం కాంగ్రెస్‌తో కలసి ఎన్‌సి కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారానికి రాబోతున్నది. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అవుతారు’ అని ఫరూఖ్ అబ్దుల్లా సమాధానం ఇచ్చారు. 370 అధికరణం రద్దును జెకె ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేందుకు ఈ తీర్పు ఒక నిదర్శనం అని ఎన్‌సి అధ్యక్షుడు అన్నారు.

‘ప్రజలు తీర్పు ఇచ్చారు, 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాలు తమకు ఆమోదయోగ్యం కావని వారు నిరూపించారు’ అని ఆయన చెప్పారు. ‘ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఫలితాలకు భగవంతునికి కృతజ్ఞుడిని’ అని ఫరూఖ్ చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వం ప్రజల ‘బాధలు’ తీర్చేందుకు ఎంతో కృషి చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు, ‘మేము నిరుద్యోగితను అంతం చేయవలసి ఉంటుంది, ద్రవ్యోల్బణం, మాదకద్రవ్యాల బెడద వంటి సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. ఇక ఎల్‌జి, ఆయన సలహాదారులు ఉండరు. 90 మంది ఎంఎల్‌ఎలు ఉంటారు. వారు ప్రజల కోసం పాటుపడతారు’ అని ఫరూఖ్ చెప్పారు.

జెకె ప్రభుత్వంలో కేంద్రం జోక్యం ఉండరాదు: మెహబూబా

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితమైన తీర్పు నుంచి కేంద్రం గుణపాఠం నేర్చుకోవలసి ఉందని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం వ్యాఖ్యానించారు. రానున్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం ‘కల్పించుకోరాదు’ అని ఆమె కోరారు, ఎన్నికల్లో విజయానికి ఎన్‌సి నాయకత్వాన్ని ఆమె అభినందించారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని మెహబూబా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News