Thursday, October 17, 2024

ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని

- Advertisement -
- Advertisement -

హరియానా ప్రజలు తిరస్కరించారు –
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు అంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్, ఏడు గ్యారెంటీల పేరిట మభ్యపెట్టాలని చూసినప్పటికీ హర్యానా ప్రజలు ఆ పార్టీకి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. హామీల అమలులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని దేశం మొత్తం గమనిస్తోందని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. అబద్ధపు హామీలతో అధికారం సాధించి ఆ తరువాత ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు.

ఒక్కో రాష్ట్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఒక్కో గ్యారెంటీ పెంచుకుంటూ గారడీ చేద్దామని చూసి.. కాంగ్రెస్ బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు చిత్తుకాగితంతో సమానంగా మారిపోయిందని మండిపడ్డారు. ఏడు గ్యారంటీలు అంటూ తమ మోసాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.హర్యానా ప్రజలిచ్చిన తీర్పుతో గ్యారంటీలకు ఇక వారెంటీ లేదన్నది స్పష్టంగా తేలిపోయిందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీల డొల్లతనం పూర్తిగా అర్థమైపోయిందని స్పష్టం చేశారు. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని, ఆయా రాష్ట్రాల్లో పాలనాపరమైన వైఫల్యాలు కాంగ్రెస్ ఓటమికి కారణమని వెల్లడించారు. సోషల్ మీడియా విస్తృతి రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో రాష్ట్రాలు వేరైనా ప్రజల నుంచి వాస్తవాలు దాచడం సాధ్యం కాదని స్పష్టంచేశారు.

భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే : కాంగ్రెస్‌తో హోరాహోరీ ఉన్న రాష్ట్రాల్లోనే బిజెపి గెలుస్తోందని, ఆ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ బలహీనమైన నాయకత్వం కూడా ఓ ప్రధాన కారణమని కెటిఆర్ పేర్కొన్నారు. బిజెపిని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉన్నదనే విషయం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను చూస్తే అర్థమైపోతుందని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఫలితాలు కూడా రెండు జాతీయ పార్టీలకు ఏమాత్రం ఆశాజనకంగా ఉండవని భావిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా ఈ ఫలితాలను చూస్తుంటే 2029లో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లకు సాధారణ మెజార్టీ సాధ్యం కాదన్నది స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. బలమైన ప్రాంతీయ పార్టీలే తదుపరి కేంద్రం ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు.

హర్యానాలో కాంగ్రెస్ ఓటమితోనైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలని కెటిఆర్ సూచించారు. బుల్డోజర్ రాజ్, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాలకు హర్యానా ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ బుల్డోజర్ రాజ్‌లు, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా వ్యహహారాలు నడుస్తుంటే రాహుల్ గాంధీ చూసీ చూడనట్లు వ్యవహరించిన తీరును దేశం మొత్తం గమనిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి, పది నెలలైనా ఒక్క గ్యారెంటీని సక్రమంగా అమలుచేయని కాంగ్రెస్‌కు ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టడం ఖాయమని మండిపడ్డారు. తెలంగాణలో సంక్షేమ రంగాన్ని సమాధి చేసి.. పదేళ్ల ప్రగతికి పూర్తిగా పాతరేసిన కాంగ్రెస్ పార్టీని ఆ పాపం వెంటాడటం తథ్యమని కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News