Wednesday, October 16, 2024

తెలంగాణ సాధనకు ’అలయ్ బలయ్’ స్ఫూర్తి

- Advertisement -
- Advertisement -

అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలి
‘అలయ్ బలయ్’ నిర్వహణ అభినందనీయం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ సాధించుకోవడానికి ’అలయ్ బలయ్’ స్ఫూర్తిగా పని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ముఖ్య ఉద్దేశంగా, – రాజకీయాలతో సంబంధం లేకుండా ’అలయ్ బలయ్’ నిర్వహించడం అభినందనీయమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయను కొనియాడారు. తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యతగా పేర్కొన్న ముఖ్యమంత్రి ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ కూడా తెలంగాణ కోసం ఉద్యమించాయని గుర్తు చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, మేఘాలయ గవర్నర్ విజయ్ శంకర్, రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిషన్‌రావ్ బాగ్డే, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు పగాడే, మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, తదితరులు కూడా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని సామాజికవర్గాలు కార్యోన్ముఖులు కావడానికి అలయ్ బలయ్ దోహదపడిందని సీఎం వివరించారు.

తెలంగాణ సాధనకు రాజకీయ జేఏసీ ఆవిర్భావానికి కూడా అలయ్ బలయ్ ఉపయోగపడిందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అతిపెద్ద పండగ దసరా పర్వదినాన అందరికీ గుర్తొచ్చేది పాలపిట్ట, జమ్మిచెట్టు అన్నారు. మరోవైపు ‘అలయ్ బలయ్’ అంటే గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ అని సిఎం కొనియాడారు. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. దత్తాత్రేయ వారసత్వాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ముందుకు తీసుకు వెళ్లడం అభినందనీయమని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జెండాలకు అజెండాలకు అతీతంగా ఒక పొలిటకల్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిగా పనిచేసిందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వీహెచ్, కేశవరావు, పొన్నం ప్రభాకర్ అలయ్ బలయ్‌లో పాల్గొన్నారని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు సంబంధం లేదని, అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను దత్తాత్రేయ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. తొలుత అలయ్ బలయ్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఢంకా మోగించగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, పులి వేషాలు అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టాయి. హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంది. సిఎం రేవంత్‌రెడ్డిని దత్తాత్రేయ సన్మానించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన గొంగళి, కర్ర బహుకరించారు. వేదిక మీదున్న గవర్నర్‌లు, బీజేపీ నేతలకు కూడా గొంగళి, కర్ర బహుకరించారు.

మాట నిలబెట్టుకున్న సిఎం రేవంత్‌రెడ్డి

గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తానని చెప్పారని, ఆ మేరకు ఆయన వచ్చి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఆత్మ విశ్వాసంతో ఎదిగిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని కొనియాడారు. జడ్పీటీసీ నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగారని దత్తాత్రేయ పేర్కొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసిమెలసి రాష్ట్రాల అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు. రాజకీయాలకతీతంగా పరస్పరం సహకరించుకుని, ఐకమత్యంతో ముందుకు వెళ్లి, దేశంలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా 2005లో అలయ్ బలయ్ ప్రారంభించామని, ప్రేమ, ఆత్మీయత, ఐక్యత చాటి చెప్పాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యమని వివరించారు. ఈసారి కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ అలయ్ బలయ్‌లో ప్రదర్శించామని అన్నారు.
అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది

అలయ్ బలయ్ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్నేహశీలి అయిన బండారు దత్తాత్రేయ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఓ చక్కని సంప్రదాయాన్ని ఏర్పాటు చేయటం, వారి కుమార్తె విజయలక్ష్మి ఆ సంస్కృతిని కొనసాగించటం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా, సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఐక్యంగా ఉండటం అంటే అంతా ఒకే మాట మీద నిలబడటమే కాదు, పక్కవారి ఆలోచనలను, భావాలను గౌరవించటం కూడా అని వెంకయ్యనాయుడు వివరించారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదిక మీద చూడటం ఎంతో ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు సిద్ధాంతాలకే పరిమితం కావాలని, నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే, అది కార్యకర్తల వరకూ పాకుతుందని, ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి కార్యక్రమాల స్ఫూర్తితో సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని, సమిష్టి తత్వాన్ని పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

కిషన్‌రెడ్డి, పొన్నం మధ్య మాటకు మాట

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు విమర్శించుకోవాల, కానీ ప్రజలు అసహ్యించుకునేలా కాదని అన్నారు. నాయకులు మాట్లాడే తీరుతో పాటు భాషలోనూ మార్పు రావాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఘర్షణ పడొచ్చని, కానీ ఆ తర్వాత అంతా మర్చిపోయి ప్రజల శ్రేయస్సును కోరుకోవాలని సూచించారు. ప్రస్తుతం పార్టీలు విమర్శించుకుంటున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు రాష్ట్ర బిసి సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో భాష ముఖ్యమని, కానీ వేరేవాళ్లకు ఇబ్బంది కలిగించ కూడదని చెప్పారు.

కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అలాంటి వారికి స్వీయ నియంత్రణ ఉండాలని బిజెపి నేతలను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు కోట శ్రీనివాసరావు, తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News