Wednesday, October 16, 2024

కెటిఆర్ స్ఫూర్తితో పేద వైద్య విద్యార్థిని చదువుకు అండగా నిలిచిన ఎన్‌ఆర్‌ఐ వెంకట్

- Advertisement -
- Advertisement -

విద్యార్థినికి తల్లితండ్రులకు కెటిఆర్ ద్వారా
ఏడాది ఫీజు చెక్కు అందజేత

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్ఫూర్తితో పేద విద్యార్థిని చదువుకు ఎన్‌ఆర్‌ఐ దూడల వెంకట్ అండగా నిలిచారు. ఆ విద్యార్థిని ఎంబిబిఎస్ మొదటి ఏడాది ఫీజుకు సంబంధించిన చెక్కును కెటిఆర్ ఆధ్వర్యంలో తన కుటుంబ సభ్యుల ద్వారా అందజేశారు. వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా కొల్లాపూర్ తాలూకా వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామానికి చెందిన పేద విద్యార్థిని బి గౌరీ మెడిసిన్‌లో సీటు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె చదువు కోసం ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని కెటిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన కెటిఆర్ గౌరీ చదువు పూర్తయ్యే వరకు తానే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే కెటిఆర్ స్ఫూర్తితో ఆ పేద విద్యార్థిని చదువుకు తన వంతు సాయం అందించేందుకు అమెరికాలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ దూడల వెంకట్ ముందుకు వచ్చారు.

తన జన్మదినం సందర్భంగా దూడల వెంకట్ తన కుటుంబ సభ్యుల ద్వారా నందినగర్‌లో కెటిఆర్ ఆధ్యర్యంలో గౌరి కుటుంబానికి మొదటి సంవత్సరం ఫీజుకు సంబంధించిన రూ. 1,65, 000 చెక్‌ను అందజేశారు. చెక్కును అందించేందుకు వెంకట్ తండ్రి దూడల రవీందర్ తమ సొంతూరు ఆలేరు మండల కేంద్రం నుంచి నందినగర్‌లోని కెటిఆర్ నివాసానికి వచ్చారు.ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ వెంకట్‌ను ఆయన కుటుంబ సభ్యులను కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

విద్యార్థిని గౌరీతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కెటిఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. గౌరీ కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గురుకుల స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశానని గౌరీ చెప్పటంతో కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన చదువుకు అండగా నిలిచిన కేటీఆర్ తో పాటు ఎన్‌ఆర్‌ఐ దూడల వెంకట్ కు గౌరి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News