Wednesday, October 16, 2024

కొత్త టీచర్లకు పోస్టింగులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : డిఎస్‌సి 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చారు. కొన్ని జిల్లాలకు ఖాళీల వివరాలు సకాలంలో అందకపోవడంతో సాంకేతిక సమస్యలతో ఉదయం కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా వేసినట్లు అధికారు లు ప్రకటించారు. సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించడంతో మధ్యాహ్నం తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతినిచ్చింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తక్కువ పోస్టులు ఉన్న జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియ సాయంత్రం లోపు ముగియగా, ఎక్కువగా పోస్టులు ఉన్న జిల్లాల్లో కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. అప్పటికే కౌన్సెలింగ్‌కి వచ్చి వెనుదిరిగిన వారికి డిఇఒలు సమాచారం అందించారు.

అవాక్కైన అభ్యర్థులు
షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయమే కొత్త టీచర్ల కు కౌన్సెలింగ్ ప్రక్రియ జరగాలి. ఈ మేరకు ఉపాధ్యా య నియామకాలు అందుకున్న కొత్త టీచర్లకు విద్యాశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. దాంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా జిల్లాల్లో డిఇఒ కార్యాలయాలకు చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య ఏర్పడటంతో కౌన్సెలింగ్ వాయిదా వేశామని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కరోజు ముందు కౌన్సెలింగ్ ఉందని సమాచారం ఇచ్చి ఉదయమే వాయిదా వేయడంతో అవాక్కయ్యారు. కౌన్సెలింగ్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నఫలంగా వాయిదా వేయడం అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News