Sunday, October 20, 2024

రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి

- Advertisement -
- Advertisement -

సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పలు జోన్లలో 25 వేల ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయితే వీటికి దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఈమేరకు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కొత్త నిబంధన కింద , సూపర్‌వైజర్ నుంచి ట్రాక్‌మెన్ వరకు పలు ఉద్యోగాలకు రైల్వే నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 65 ఏళ్ల లోపు వారు మాత్రమే ఇందుకు అర్హులని చెప్పినట్టు సమాచారం.

రెండేళ్ల పదవీకాలానికి గాను వీరిని నియమించుకోనున్నారు. అవసరమైతే పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్టు సదరు కథనాలు పేర్కొన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు గత ఐదేళ్ల మెడికల్ ఫిట్‌నెస్‌తోపాటు , పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు వారి పనితీరును పరిశీలించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. గతంలో విజిలెన్స్, లేదా డిపార్ట్‌మెంట్ చర్యలను ఎదుర్కొన్న వారు దరఖాస్తులకు అనర్హులని తేలినట్టు సమాచారం. ఇలా నియమించుకున్న వారికి , చివరిసారిగా వారు పొందిన నెలవారీ వేతనంలో నుంచి బేసిక్ ఫించనును తొలగించి జీతాలు చెల్లించనున్నారు. అంతేగాక, ట్రావెల్ అలవెన్సులు, అధికారిక టూర్ల వంటి ప్రయోజనాలు కల్పించనున్నారు.

అయితే ఇంక్రిమెంట్ల వంటి బెనిఫిట్స్ వీరికి ఉండవని సదరు కథనాలు పేర్కొన్నాయి. సిబ్బంది కొరతతోపాటు గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క వాయవ్య రైల్వేజోన్ లోనే 10వేలకు పైగా ఖాళీలున్నాయి. మిగతా జోన్ల లోనూ పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉందని రైల్వేశాఖ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News