Monday, October 21, 2024

విమానాలకు బాంబు బెదరింపు

- Advertisement -
- Advertisement -

ఒక్క ఫోన్ కాల్ వల్ల ఎంత నష్టమంటే
తనిఖీ చేసి తిరిగి పంపించే సరికి రూ. 3 కోట్ల ఖర్చు
ప్రయాణికులు వేసే కోర్టు కేసుల తలనొప్పి అదనం
తీవ్రంగా నష్టపోతున్న విమానయాన సంస్థలు

న్యూఢిల్లీ : గడచిన వారం పది రోజుల్లో దేశీయ విమానయాన సంస్థలకు ఏకంగా 70 బాంబు బెదరింపులు వచ్చాయి. విమానంలోనో, విమానాశ్రయంలోనో బాంబు ఉందని సోషల్ మీడియా ఖాతాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ఆగంతకులు బెదరింపులకు పాల్పడ్డారు. అవన్నీ ఉత్తుత్తి బెదరింపులే కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, విమానయాన సంస్థల యాజమాన్యాలు తల పట్టుకుంటున్నాయి. ఇలా బెదరింపులు వచ్చిన ప్రతి సారీ భారీ మొత్తంలో ఖర్చు అవుతుండడమే దానికి కారణం. ఒక్కసారి విమానాన్ని ఆపడం గానీ, దారి మళ్లించడం గానీ చేస్తే ఏకంగా రూ. 3 కోట్ల వరకు ఖర్చు అవుతోందని ఆయా సంస్థలు వాపోతున్నాయి.

బాంబు బెదరింపులు వచ్చిన ప్రతి సారీ ప్రొసీజర్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందే. ఏ బెదరింపునూ అలక్షం చేయడానికి వీలు లేదు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో రిస్క్ చేయలేరు. బెదరింపులు వచ్చినప్పుడు విమానం గాలిలో ఉంటే దగ్గరలోని విమానాశ్రయంలో దించాలి. రన్‌వేపై ఉంటే ఎయిర్‌పోర్ట్‌కు దూరంగా తీసుకువెళ్లి ప్రయాణికులను దించేసి విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే బాంబ్ స్కాడ్‌ను రప్పించడం, తనిఖీ చేయించడం వంటి వ్యవహారాలు ఉంటాయి. ఇదంతా జరగడానికి ఎంత లేదన్నా రెండు మూడు గంటలు పడుతుంది. ఆ తరువాత విమానం గాలిలోకి ఎగరాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) అనుమతి కావాలి. ఆ సమయానికి ఎయిర్‌పోర్ట్‌కు రావలసిన, అక్కడి నుంచి వెళ్లవలసిప విమానాల షెడ్యూల్ చెక్ చేసి, అవసరమైన సర్దుబాటు చేసి ఎటిసి అనుమతి ఇస్తుంది. దీనికి మరి కొంత ఆలస్యం జరుగుతుంది. దీని వల్ల ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూస్తూ ఉండాలి. నిబంధనల ప్రకారం విమానాన్ని అర్ధంతరంగా ఆపివేస్తే ప్రయాణికులకు హోటల్ వసతి, భోజన సదుపాయాలు, రవాణా సదుపాయాలు ఆయా విమానయాన సంస్థలే ఏర్పాటు చేయాలి.

తనిఖీలకు, ప్రయాణికులకు చేసే ఏర్పాట్లకు అయ్యే ఖర్చుతో పాటు ఒక వేళ విమానాన్ని దారి మళ్లిస్తే ఇంధన ఖర్చు& ఇలా అన్ని ఖర్చులు కలసి విమానయాన సంస్థలకు తడిసి మోపెడు అవుతుంది. ఈ ఖర్చులకు అదనంగా ప్రయాణికులు వేసే లీగల్ కేసుల తలనొప్పి మరొకటి ఉంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో కొందరు అంతర్జాతీయ ప్రయాణికులు కూడా ఉంటారు. కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు హైదరాబాద్ ఢిల్లీ విమానంలో ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి మరొక విమానంలో వేరే దేశానికి వెళుతుంటారు. అటువంటి ప్రయాణికులు తాము ఎక్కవలసిన విమానం అందుకోలేరు. దీనికి కారణం హైదరాబాద్‌లో తాము ఎక్కవలసిన విమానం ఆలస్యం కావడమేనని వారు కోర్టును ఆశ్రయిస్తారు. ఇప్పటికే అటువంటి చాలా కేసులను విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని సార్లు అటువంటి ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది. ఇలా ఒక్కసారి విమానానికి బాంబు బెదరింపులు వస్తే రూ. 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News