Wednesday, October 23, 2024

ధరణి సమస్యల నుంచి రైతులకు త్వరలో విముక్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలోనే ధరణి సమస్యల నుంచి రైతులకు పూర్తిగా మిముక్తి కల్పిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ధరణి నిర్వహణను ఎన్‌ఐసికి అప్పగిస్తూ ఉత్వర్వులు జారీ చేయడంపై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటి వరకు విదేశీ సంస్థ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధరణి నిర్వహణ బాధ్యతను స్వదేశీ సంస్థ ఎన్‌ఐసికి అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. డిసెంబర్ 01వ తేదీ నుంచి రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ బాధ్యతను జాతీయ సమాచార సంస్ధ (ఎన్‌ఐసి ) నిర్వహిస్తుందని మంత్రి వెల్లడించారు. ఆనాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు ఎలాంటి ముందు చూపు లేకుండా హడావుడిగా తొందరపాటు నిర్ణయాలతో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొందని మంత్రి పొంగులేటి ఆరోపించారు.

అప్పట్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు తెలంగాణకు చెందిన 1.56 కోట్ల ఎకరాల భూమిని టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఒరిస్సా రాష్ట్రంలో ఈ సంస్థ పనిచేసి విఫలమయ్యిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంస్థ కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బిఆర్‌ఎస్ పెద్దలు కట్టబెట్టారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ విదేశీ కంపెనీల చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసుకుంటుందన్నారు.
71 లక్షల ఖాతాలకు పూర్తి రక్షణ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసికి ఈ బాధ్యతలు అప్పగించామని తద్వారా 71,00,000 ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభించినట్లయిందని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఎన్నికల ప్రణాళికలో ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపడతామని ప్రకటించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News