Saturday, October 26, 2024

హుస్నాబాద్‌లో మెగా విదేశీ జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో వచ్చే నెల రెండవ వారంలో నిరుద్యోగ యువత కోసం మెగా విదేశీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే యువత ముందుగా తమ పేర్లను ఎన్‌రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి టాంకాం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో భారీ వేతనాలతో ఉన్న ఉద్యోగ అవకాశాలు పొందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్‌లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో వారికి ఉన్న స్కిల్స్ ఆధారంగా పలు దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మెగా ఫారిన్ జాబ్ మేళాను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

నవంబర్ మొదటి వారంలో జరిగే జాబ్ మేళా కోసం మండలాల్లో అవగాహన కల్పించాలని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత డేటా సేకరించి వారికి ఆసక్తి ఉన్న విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకి మంచి స్పందన వచ్చిందని, దాని ద్వారా 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. విదేశాల్లో లక్షల్లో జీతాలు ఉన్న ఉద్యోగాలకు టాంకాం కంపెనీ ద్వారా నైపుణ్యల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఇక్కడి నుండి మంచి కంపెనీలకు పంపించడానికి ఉన్న మెరుగైన అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా జర్మనీ, జపాన్, కెనడా, గల్ఫ్ దేశాలు, యూఎస్‌ఏ, యూకే, ఇజ్రాయేల్, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉండనున్నాయని తెలిపారు.

ఇప్పటికే టాంకాం ద్వారా శిక్షణ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి, టాంకాం సీఈఓ డా. ఈ.విష్ణు వర్ధన్ రెడ్డి , టాంకాం జిఎం నాగ భారతి, షబ్నా టాంకాం మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News