Saturday, October 26, 2024

మూసీలో… ఉండడానికి నేను రెడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ సుందరీకరణకు సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి విసిరి న సవాల్‌కు తాము సి ద్ధంగా ఉ న్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తు న్న వారు మూడు నెలల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటే ఆ ప్రాజెక్టును విరమించుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ చేశారని, అందుకు తాము సిద్దమేనని, అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించేందుకు సిద్దమేనా అని సవాల్ విసిరారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా ధర్నా చౌక్ ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం జరిగిన బిజెపి మహా ధర్నాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. మూసీ ప్రక్షాళన, ఆధునీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే పేదల ఇళ్లను నిర్ధాక్షణ్యంగా కూల్చివేయడానికి తాము అంగీకరించమని అన్నారు. పేదలకు బిజెపి ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి కావస్తోందని, నిరుపేదలకు ఇచ్చేందుకు ఏ ఇంటికి రేవంత్ సర్కార్ ఇంతవరకు శంకుస్థాపన చేయలేదని, భూమి పూజ చేయలేదని విమర్శించారు.

కొత్తగా ఇవ్వకపోగా ఎన్నో ఏళ్లగా నివశిస్తున్న నిరుపేదల ఇండ్లను కూలుస్తోందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను గారడీలుగా మార్చి మసి పూసి మారేడుకాయ చేశారని ఆరోపించారు. ప్రజలను సోనియా, రాహుల్, రేవంత్ మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రజల ఇండ్లకు మార్కింగ్ వేసి ప్రజలను భయపెట్టారని తెలిపారు. కేసీఆర్ దారిలోనే ఇప్పుడు రేవంత్ వెళ్తున్నారని ఆరోపించారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ సుందరీకరణ చేసుకోవాలన్నారు. మూసీ బాధితు కోసం అవసరమైతే చంచల్ గూడ జైలుకు అయినా, చర్లపల్లి జైలుకు అయినా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రేవంత్ రెడ్డి పోలీసులతో వస్తారా..? ఎలా వస్తారో కానీ మూసీ బస్తీల్లోకి రావాలి, ఆయనను ప్రజలు ఏమీ అనకుండా తాము రక్షణగా ఉంటామని కిషన్‌రెడ్డి తెలిపారు. డ్రైయినేజీ విధానం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

ఆరు గ్యారంటీల అమలును డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ డ్రామా
ఆరు గ్యారెంటీల అమలును డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ అని ఆరోపించిన ఆయన ఆ పార్టీలో ఎవరికీ వారే సీఎంలంటూ సెటైర్ వేశారు. సబర్మతి ఖర్చు రూ.7 వేల కోట్లు అని, నమామి గంగ ఖర్చు రూ.40 వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా అని ప్రశ్నించారు. ఒక్క కిలోమీటర్‌కు రూ.2 వేల కోట్లా అని ఆయన సిఎం రేవంత్‌ను నిలదీశారు. మూసీ ప్రాజెక్టు కన్నా ఖరీదైన ప్రాజెక్టు మరెక్కడా లేదేమోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైతీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ సుందరీకరణపై ఆయనకే స్పష్టత లేదని అన్నారు. మొన్నటి వరకు హైడ్రా పేరుతో చేపట్టిన ఆపరేషన్ ఆ బాధితుల్లో జెసిబి, బుల్డోజర్లు అనే భయం కనిపించాయని,

ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. మూసీ ఒకప్పుడు మంచినీళ్లు అందించిందని, ఇప్పుడు విషం కక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశానని, మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. పరిశ్రమలకు అడ్డగోలుగా అనుమతి ఇచ్చింది గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఇటీవల రేవంత్ లండన్ వెళ్లి ఒక నది చూశారు, అది చూసే మూసీప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు అవుతుందని అన్నారు. నిన్న సియోల్‌కు నేతలను పంపారు, వాళ్ళు ఇప్పుడు ఎంత చెప్తారో చూడాలని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రేవంత్ మొన్న మూసీ సుందరీకరణ అని ఒకసారి అంటారు, పునరుజ్జీవనం అని మరోసారి అంటారని, అదేంటో ఆయనకే క్లారిటీ లేదని చురకలు వేశారు. తమకు కేసులు, లాఠీలు కొత్త కాదు, ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో, మేము కొట్లాడేందుకు సిద్ధమని ముఖ్యమంత్రిపై బండి సంజయ్ ధ్వజమెత్తారు.

లంకె బిందలు మూసీలో ఉన్నాయా.?
లంకె బిందెలు ఖాళీగా ఉన్నాయని చెప్పావు కదా ఆ లంకె బిందెలు మూసీలో ఉన్నాయా? అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బిజెపి మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ఆ ఇండ్లకు అనుమతి ఇచ్చారని, ఇప్పుడు ఎలా అక్రమమయ్యాయో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణను ఏటీఎంలాగా మార్చుకోవాలనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు, అక్రమ సంపాదన కోసమే పేదల ఇండ్లను కూలిస్తే బిజెపి చూస్తూ ఉరుకోబోదని హెచ్చరించారు. తమకు లండన్, సియోల్ అక్కర్లేదు, మా హైదరాబాద్ లాగానే ఉంచండి చాలు, గతంలో కేసీఆర్ ఇస్తాంబుల్ లాగా మారుస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు మీరు లండన్, సియోల్ అంటున్నారని రేవంత్‌పై మండిపడ్డారు. రేవంత్ సర్కార్‌కు పేదల భూములే కనిపిస్తున్నాయా? ఎంఐఎం నేతలవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేదల నివాసాలు కూల్చి ఎంఐఎం నేతలవి ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు.

బిజెపి ఆందోళనతోనే హైడ్రా తోకముడిచింది
బిజెపి చేపట్టిన ఆందోళనలతోనే హైడ్రా తోక ముడిచిందని మల్కాజిగిరి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అబద్ధాలకు మారుపేరు సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయకపోతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వబోమని బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలని, కానీ ఇలా బలవంతంగా మరో ప్రాంత ప్రజలను రోడ్డున పడేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇక నుంచి ఒక్క ఇళ్లు కూల్చిన ఊరుకోము అని హెచ్చరించారు. ఈ ధర్నాలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపిలు, బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News