Monday, October 28, 2024

సివిల్ ఏవియేషన్‌లో ఉన్న రెండు చట్టాల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

ఫేక్ కాల్ చేస్తే ఇక అంతే
బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్
త్వరలోనే భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖ- విజయవాడ మధ్య రెండు విమాన సర్వీసులు ప్రారంభం

మన తెలంగాణ / అమరావతి : బాంబు బెదిరింపులను అరికట్టడానికి ట్విట్టర్, లా ఏజెన్సీలు, ఇంటిలిజెన్స్ సహకారం తీసుకుంటున్నామని, సివిల్ ఏవియేషన్‌లో ఉన్న రెండు చట్టాల్లో మార్పులు చేస్తున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విమానాలకు వరుస బాంబు బెదిరింపులు ఇటీవల దేశంలో సంచలనం రేపుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 200 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఈ క్రమంలో విమానాలకు వస్తోన్న వరుస బాంబ్ థ్రెట్స్‌పై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరోసారి స్పందించారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని తెలిపారు. విమానాల్లో బాంబులు ఉన్నాయంటూ సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం జరుగుతోందని, దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. విచారణ తరువాత బాంబు బెదిరింపుల తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. -నూతన చట్టం తీసుకువచ్చి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నవారికి విమాన ప్రయాణం నిషేధించాలని ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.

ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు విమానాలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం విశాఖ విమానాశ్రయంలో ఆయన రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించారు. ఈ రెండు విమాన సర్వీసుల్లో ఒకటి ఎయిరిండియా కాగా మరొకటి ఇండిగో. ఈ రెండు విమానాలు విశాఖ-విజయవాడ మధ్య తిరగనున్నాయి. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖ-విజయవాడ మధ్య ఫ్లయిట్ కనెక్టివిటీ పెంచాలని చాలా విజ్ఞప్తులు వచ్చాయని అన్నారు. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు విమానాలు ప్రారంభించడం ఇదే తొలిసారి అని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

ఆయా రూట్లలో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వస్తే టికెట్ ధరలు తగ్గుతాయని వివరించారు. విశాఖ-విజయవాడ మధ్య విమాన టికెట్ బహుశా రూ.3 వేలు ఉండవచ్చని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలో విశాఖ- గోవా మధ్య కూడా విమాన సర్వీసులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, భవిష్యత్తులో విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని భోగాపురంలో నెలకొల్పాలని నిర్ణయించామని వెల్లడించారు. ఎయిర్ కార్గోపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆ దిశగా ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయని అన్నారు. ఏపీలో విమానయాన అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

నూతన విమాన సర్వీసుల టైమింగ్స్ : ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై, 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి, 9 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే ఇండిగో సర్వీసు రోజూ రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరి 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8.45 గంటలకు విశాఖలో బయలుదేరి, 9.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
అయ్యప్ప స్వాములకు శుభవార్త : అయ్యప్ప స్వాములకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. అయ్యప్ప స్వాములు ఇక నుంచి ఇరుముడితో ఫ్లైట్లో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 20 వరకు సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News