ఢిల్లీ: దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహించడంతో పాటు గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఇ, ఎగుమతులు, పెట్టుబడులతో పాటు ఆరు రంగాల్లో సమూల మార్పులు తీసుకోస్తున్నామన్నారు. పిఎం ధన్ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం తీసుకరావడంతో పాటు 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని, 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు. బిహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని, పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్ మిషన్ ఏర్పాటు చేశామని, పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం ఏర్పాటు చేశామన్నారు.
పోస్టల్ రంగానికి కొత్త జవసత్వాలు నింపడంతో పాటు ఎంఎస్ఎంఇలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి అని నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. సున్నా శాతం పేదరికమే మా లక్ష్యమని, వికాస్ భారత్లో వంద శాతం క్వాలిటీ విద్య ఉంటుందని, 2024-25లో ఎకానమీ వృద్ధి అంచనా 6.4 శాతం, 2025-26కు అంచనా 6.3-6.8 శాతానికి తీసుకెళ్తామన్నారు. సబ్ కా వికాస్కు వచ్చే ఐదేళ్లు సువర్ణవకాశం ఉంటుందన్నారు. మేం చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయని, ఆరు రంగాల్లో సమూల మార్పులు చేస్తామని, 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం ఉంటుందని, ఇన్ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక ఉంటుందని, పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్, పోస్టల్ శాఖకు కొత్త రూపు ఇచ్చేలా ప్రణాళిక, ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రోత్సాహం, నేషనల్ మ్యాన్ఫ్యాక్షరింగ్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు దిద్దామని, అన్ని ప్రభుత్వ స్కూల్స్కు బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నామని, పదేళ్లలో ఐఐటిల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపుగా మారిందని, ఐఐటి పాట్నా విస్తరణకు నిర్ణయం తీసుకున్నామని, విద్యారంగంలో ఎఐ వినియోగం తీసుకొస్తున్నామని, ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు ఏర్పాటు చేశామని, బిహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడంతో రూ.30 వేలతో స్ట్రీట్ వెంటర్స్కు క్రెడిట్ కార్డులు ఇచ్చామని, బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం రూపొందించామన్నారు.
అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సంస్కరణలు అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు ఇస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.