ప్రయాగ్రాజ్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు 77 దేశాల దౌత్యవేత్తలు హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్ , కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలీవీయా, తదితర 77 దేశాల దౌత్యవేత్తలు తొలిసారి ఇక్కడికి వచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కుంభమేళాను సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. లిధువేనియా రాయబారి డయానా మికెవిసీస్న్ మాట్లాడుతూ తనకు భారత్తో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని అన్నారు. అయితే కుంభమేళాలకు వెళ్లే అవకాశం ఎప్పుడూ రాలేదని , ఇప్పుడు ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు.
నేపాల్ రాయబారి మాట్లాడుతూ కుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని అన్నారు. దక్షిణాఫ్రికా హైకమిషనర్ అనిల్ సూక్లాల్ మాట్లాడుతూ కుంభమేళాలో తాము పాల్గొనడానికి భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అనుమతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు జీవితాంతం గుర్తుండి పోతుందని ఆనందం వ్యక్తం చేశారు. కేవలం హిందువులే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు ఇందులో పాల్గొనడం భారత సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేస్తుందన్నారు. తొక్కిసలాట సంఘటనతో అప్రమత్తమైన యోగి సర్కారు , భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు పలు చర్యలు చేపట్టింది. కుంభ్ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. వీవీఐపీ, స్పెషల్ పాస్లను కూడా రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.