రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్సితో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ మూడు స్థానాలకు కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు,ఉపాధ్యాయ సంఘాలు
రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానాలకు రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కరీంనగర్ మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్సి అభ్యర్థిగా.. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఊటుకూరి నరేందర్రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. బిజెపి మూడు ఎంఎల్సి స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎంఎల్సి స్థానానికి అభ్యర్థిగా నరోత్తమ్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎంఎల్సి అభ్యర్థిగా మల్క కొమరయ్య, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎంఎల్సి అభ్యర్థిగా అంజిరెడ్డి బిజెపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు సైతం ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ఆయా నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ -ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గానికి పింగిలి శ్రీపాల్ రెడ్డి,
కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ నియోజకవర్గానికి వంగ మహేందర్ రెడ్డిని పిఆర్టియుటిఎస్ తరపున తమ అధికారిక అభ్యర్థులుగా ప్రకటించింది. అలాగే జాక్టో తరపున వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి మాజీ ఎంఎల్సి పూల రవీందర్ ఖరారు చేశారు. టిఎస్ యుటిఎఫ్, టిపిటిఎఫ్ సంఘాలు వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ప్రస్తుత ఎంఎల్సి అలుగుబెల్లి నర్సిరెడ్డిని, మెదక్ -నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి టిపిటిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్ను ప్రకటించాయి. ఈ మేరకు ఆయా సంఘాల ప్రతినిధులు ఆయా ఉపాధ్యాయ ఎంఎల్సి నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఓటరు నమోదు చేయించగా, అభ్యర్థులతో కలిసి నేతలు ఆయా జిల్లాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
బిఆర్ఎస్ పోటీ చేసేనా?
మూడు ఎంఎల్సి ఎన్నికలకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటివరకు ఎలా ంటి స్పష్టత ఇవ్వలేదు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్సి ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కెసిఆర్ ఎం ఎల్సి ఎన్నికలను ఉపయోగించుకున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పలు ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అ యితే గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నికలో బిఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఆశావహులు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న వారిని ఓటర్లుగా నమోదు చేయించారు. అధినేత తమ పట్ల సుముఖంగా ఉన్నారని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు.