Tuesday, February 4, 2025

తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లు నడుపుతామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని వివరించారు. కాజీపేట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. “ ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడి రైల్వే ట్రాక్‌లను పరిశీలించాం. రైల్వే ట్రాక్‌ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తున్నాం. వందేభారత్ ట్రైన్లలో స్లీపింగ్ సీట్లపై ట్రయల్ జరుగుతోంది. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నాం.

తెలంగాణలో 1326 కిమీ మేర ప్రస్తుతం కవచ్ టెక్నాలజీ ఉంది. మరో 1026 కిమీ మేర ఈ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నాం. 2026 లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటు లోకి తెస్తాం. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తాం. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. పేద వర్గాల కోసం నమో భారత్ రైళ్లను నడుపుతున్నాం. త్వరలో దేశమంతా దాదాపు 100 నమోభారత్ ఎక్స్‌ప్రెస్‌లు తీసుకురానున్నాం. ఈ రైళ్ల ద్వారా పేద ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ” అని కేంద్ర మంత్రి తెలిపారు.
ఏపీ లోని 73 స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాం
ఏపీలో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రూ.9417 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు. యూపీఏ హయాంతో పోల్చితే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువన్నారు. రాష్ట్రం లోని 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని, ఈ స్టేసన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించామన్నారు. ఏపీకి మరిన్ని నమోభారత్ ,వందేభారత్ రైళ్లు కేటాయించామన్నారు. రైళ్ల వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆధునిక సాంకేతికత సాయంతో రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, అందుకే ఏపీ రైల్వే ప్రాజెక్టుల గురించి బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News