కులగణనలో బిసి జనాభా తగ్గించి చూపారు బిఆర్ఎస్ సర్వేలో
1.85కోట్ల మంది బిసిలు ఉంటే..ఈ సర్వేలో 1.64లక్షలకు తగ్గించారు
లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే కులగణన సక్సెస్ అని
పార్లమెంట్లో అబద్ధం చెబుతారా? బిసిలకు 42శాతం రిజర్వేషన్లు
ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు ఇక ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను ప్రజలు
నమ్మరు రాహుల్గాంధీకి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కులగణన స ర్వేను కాంగ్రెస్ సర్కారు విజయవంతంగా పూర్తి చేసిందని రాహుల్ గాంధీ లోక్సభలో పేర్కొనడం పార్లమెంటును త ప్పుదోవ పట్టించడమేనని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ మండిపడ్డారు. పదేళ్ల క్రితం అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బిసిల సంఖ్య 1 కోటి 85 లక్షలుగా తేలిందని, రాష్ట్ర జనాభాలో ఇది 51 శాతంగా వచ్చిందని గుర్తుచేశారు. ఇక మైనారిటీల్లో ఉన్న బిసిలను కూడా కలిపితే బిసిల సంఖ్య ఏకంగా 61 శాతానికి చేరిందని స్పష్టం చేశారు. అలాంటిది పదేళ్ల తరువాత కాం గ్రెస్ సర్కారు కులగణన సర్వేలో బిసిల జనాభా 1 కోటి 64 లక్షలకు ఎలా తగ్గిందని, 46 శాతానికి ఎలా పడిపోయిందో చెప్పాలని రాహుల్ గాంధీని కెటిఆర్ సూటిగా ప్రశ్నించారు.
ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బుధవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లేఖ రాశారు. గత దశాబ్దకాలంలో బలహీన వర్గాల జనాభా తగ్గినట్టు చూపిన ఈ తప్పుడు లెక్కలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. అసమగ్రంగా జరిగిన సర్వే పూర్తయి పోయినట్టు సాక్షాత్తూ దేశ అత్యున్నత చట్టసభలో రాహుల్ పేర్కొనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కెటిఆర్ లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేనే లేదని తేలిపోయిందని ఆరోపించారు.
డిక్లరేషన్లకు ఘోరీ కట్టిన పాపం కాంగ్రెస్ను వెంటాడటం ఖాయం
కామారెడ్డి బిసి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, చివరికి కాంగ్రెస్ పార్టీపరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే మరేంటని రాహుల్ గాంధీని కెటిఆర్ నిలదీశారు. కాంగ్రెస్ చేసిన ఈ ద్రోహాన్ని చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణలోని బిసి సమాజం సిద్దంగా లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బిసి రిజర్వేషన్లు పెంచుతామని మీరు ఇచ్చిన మాటను ఏడాది టైమ్లోనే మంటగలిపి బిసిల గొంతు కోశారని రాహుల్గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో లబ్ది పొందడమే ఏకైక లక్ష్యంగా అబద్ధాలు ప్రచారం చేసి డిక్లరేషన్లకు ఘోరీ కట్టిన పాపం కాంగ్రెస్ను వెంటాడటం ఖాయమని కెటిఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణలో అమలు చేయని హామీలను, ఇక్కడి ప్రజలకు అందిస్తున్నట్టు ఎలా ప్రచారం చేసుకుంటారని రాహుల్ గాంధీని టిటిఆర్ నిలదీశారు. ఈ కులగణన సర్వేను కూడా ఇతర రాష్ట్రాల్లో వాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే పార్లమెంట్లో దీని ప్రస్థావన తెచ్చారని మండిపడ్డారు.
ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదం
కులగణనలో దొర్లిన దారుణమైన తప్పులను సవరించాల్సిన బాధ్యతను మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని కెటిఆర్ హెచ్చరించారు. తెలంగాణలోని బిసి సంఘాల నేతలు ఏకంగా కులగణన నివేదికను చించివేసి నిరసన తెలిపారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన అంతా తప్పుల తడక అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలని స్పష్టం చేశారు.ఈ సర్వేతో బిసిలకు న్యాయం జరగకపోగా కాంగ్రెస్ సర్కారు తీవ్రమైన అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. పదేళ్లలో అగ్రవర్ణాల జనాభా పెరిగి.. బిసిల జనాభా తగ్గడం.. ఎలా సాధ్యమో చెప్పగలరా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
వెనకబడిన వర్గాల భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన కోటాను తప్పుల కుప్పగా తయారుచేయడం, కాంగ్రెస్ పార్టీకి బిసిల పట్ల ఉన్న నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనలో చూపిన ఈ తప్పుడు లెక్కల వల్ల రానున్న రోజుల్లో ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని బిసి బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణలో బిసిలకు తీవ్ర అన్యాయం చేసే ఈ ఫెయిల్యూర్ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్ కోరడం మరో విడ్డూరం అని వ్యాఖ్యానించారు.
బిసిలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఎన్నికల ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడే కాంగ్రెస్ నిజస్వరూపం ఏడాది కాలంగా అనేక రూపాల్లో బయటపడిందని కెటిఆర్ అన్నారు. బిసిల జనాభాను తగ్గించి చారిత్రక తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోని వెనకబడిన వర్గాలు ఎప్పటికీ క్షమించవని తేల్చిచెప్పారు. గ్యారెంటీల పేరిట చేసిన గారడీని, డిక్లరేషన్ పేరిట చేసిన ఈ దగాను చూసిన తరువాత వచ్చే స్థానిక ఎన్నికల్లోనే కాదు.. ఏ ఎన్నికల్లోనూ ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలను నమ్మరని కెటిఆర్ కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ వేదికగా బిసి డిక్లరేషన్ ఓ నాటకం అని, బిసిలకు స్థానిక ఎన్నికల్లో కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్ల హామీ బూటకమని తేలిపోయిన నేపథ్యంలో.. తెలంగాణలోని బిసిలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.