మనతెలంగాణ/ హైదరాబాద్: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాద పూర్వకంగా కలిశారు. అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన త్రిషను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్లో దేశం తరుపున మరింతగా రాణించాలని సిఎం రేవంత్ ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల నజరానాను ముఖ్యమంత్రి ప్రకటించారు.
అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణకు చెందిన ధృతి కేసరికి రూ.10 లక్షల నజరానాను ప్రకటించింది. అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సిఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు.
హెచ్సిఎ ఆధ్వర్యంలో భారీ నజరానా..
అండర్19 మహిళా క్రికెటర్లు గొంగడి త్రిష, ధృతిలకు హెచ్సిఎ తరఫున భారీ నజరానాను ప్రకటించారు. బుధవారం జరిగిన హెచ్సిఎ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు హెచ్సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. త్రిషకు రూ.10 లక్షలు, ధృతికి రూ.5 లక్షల చొప్పున అందజేసేందుకు నిర్ణయించినట్టు ఆయన వెల్లడించాడు.